పార్వతీ పరమేశ్వరుల కుమారులు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి పెరిగి పెద్దవారయ్యారు. తన తర్వాత గణాలకు అధిపతిని నియమించే సమయం ఆసన్నమైందని ఈశ్వరుడు తలిచాడు.
ఆ సమయంలో "నేనే పెద్ద"! అంటూ కుమారస్వామి అన్నగారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఏనుగు తొండం ఉన్నవాడు అధిపతి ఎలా అవుతాడని ప్రశ్నించాడు. దీంతో కైలాసనాథుడు ఇద్దరు కుమారుల మధ్య ఓ పోటీ పెట్టాడు. భూలోకంలోని సమస్త పుణ్యతీర్థాలలో ముందుగా స్నానమాచరించి ఎవరు కైలాసానికి చేరుకుంటారో వారికే పట్టం కడతానని మహేశుడు చెప్పాడు.
దీంతో వాయువేగంతో నెమలి వాహనంపై కుమారస్వామి బయలుదేరి వెళ్లాడు. తన మూషిక వాహనంపై వెళ్లి ఎలా విజయం సాధించగలనని విఘ్నేశ్వరుడు చింతాక్రాంతుడయ్యాడు. తల్లిదండ్రులే దైవమని భావించి వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణ చేయసాగాడు. అచట స్నానానికి వెళ్లిన కుమారస్వామికి అన్నయ్య స్నానం పూర్తి చేసుకుని ఎదురు రావడం కనిపించింది.
దీనితో అన్నగారి మహత్యం తెలుసుకున్న కుమారస్వామి వినాయకుడే పట్టానికి అర్హుడని భక్తితో తండ్రికి తెలిపాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు గణాలకు నాయకుడిగా విఘ్నేశ్వరుని నియమించాడు. అప్పటినుంచీ ఆయనకు గణనాధుడు, గణేశుడు అని పేర్లు వచ్చాయి.