Publish Date: Mon, 01 Sep 2008 (19:54 IST)
Updated Date: Mon, 01 Sep 2008 (19:49 IST)
పత్రితో పూజ చేయడం గణపతి ఆరాధనలో ఒక ప్రత్యేకత. 21 పత్రులు లేదా 108 పత్రులు పూజకు వాడాలని శాస్త్రము చెబుతోంది. ఈ పత్రులన్నింటికీ ఆయుర్వేద వైద్యవిధానంలో మంచి ఔషధ సుగుణాలున్నాయి.
ఏ మాత్రము ఆదరణకు నోచుకోని జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ప్రతులను వినాయకుని పూజకు తప్పనిసరిగా వాడతారు. ఆ బొజ్జ గణపయ్య వాహనం ఎలుక అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎలుగ, జిల్లేడు, ఉమ్మెత్త లాంటి ఎలాంటి విలువా చేయని వాటిని ఈ గణనాయకుడి పూజలో వాడటం మనకు ఏం చెబుతుందంటే... అన్నింటిపట్లా గౌరవంతో వ్యవహరించాలనే...!
ఇకపోతే... తెలుగు ప్రజానీకం బొజ్జ గణపయ్యకు ఉండ్రాళ్ళు, కుడుములు, పళ్లను నైవేధ్యంగా పెడతారు. ఇవన్నీ మానవ నాగరికత పెరగక ముందటి విషయాలైనప్పటికీ ఇప్పటికీ వాటిని ఆచరిస్తున్నారు. బహుశా వినాయకుడి పూజ అతి ప్రాచీన సాంప్రదాయం కాబట్టి అలా జరిగి ఉండవచ్చు.
ఇక ముఖ్యంగా చెప్పకోవాల్సిందేమిటంటే... విఘ్నాలకు అధిపతియైన వినాయకుడి ముఖ చిత్రాన్ని పెళ్లి శుభలేఖల్లో తప్పనిసరిగా చిత్రీకరించటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇది సంప్రదాయవాదులకూ, ఆధునిక ప్రజానీకానికీ కూడా ఇది సామాన్య విషయం.
వినాయకుడి చిత్రాన్ని గీయడానికి చిత్రకారులు ఎన్నో మెళకువలూ, విధానాలను కూడా రూపొందించారు. ఒకటి రెండు చిన్న గీతలునుంచి క్లిష్టమైన డిజైన్లదాకా ఎన్నో రకాలుగా వినాయకుని చిత్రీకరిస్తుంటారు. వీటిలో ముఖ్యంగా ఓంకార ఆకృతిలో గణపయ్యను ఎక్కువగా చిత్రిస్తుంటారు.