గృహంలో శాంతి, సౌభాగ్యం ఎల్లప్పుడూ నివాసముండాలని ప్రతి ఒక్కరూ భావించడం నైజం. ఇందులో భాగంగానే వాస్తు ప్రకారం గృహాన్ని నిర్మించడం చేస్తారు. గృహాలంకరణలో కూడా కొందరు వాస్తు సూత్రాలను పాటించి మొక్కలు, వృక్షాలు, గార్డెన్లు ఏర్పాటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
ఇలాంటి వారి కోసం గృహావరణలో వృక్షస్థితి దోషాలకు సంబంధించిన అంశాలను గురించి పరిశీలిద్దామా.... గృహావరణలో తూర్పున రావిచెట్టు, దక్షిణాన జువ్విచెట్టు, పశ్చిమమందు మర్రిచెట్టు, ఉత్తరదిశలో మేడి చెట్టు ఉన్నట్లైతే ఇంటిపై వాటి ప్రభావం ఉంటుందని, దీనితో ఇంటి యజమానికి అశుభములు కలిగే అవకాశముందని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు.
అదే విధంగా తూర్పు మొదలగు నాలుగు దిక్కులందు వరుసగా రాజవృక్షము వేప, మామిడి, అరటి చెట్లున్నచో దోషం కలుగుతుంది. పశ్చిమదిశలో మందిరములు, మఠములుండుట, ఉత్తరదిశలో పెద్ద చెరువులుండుట వలన దోషములు సంభవించవచ్చునని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
గృహావరణ ఆగ్నేయ దిశలో పాలుగారు చెట్లు, నైరుతి దిశలో కడిమి చెట్లు, వాయువ్యమందు ముండ్ల చెట్లు, ఈశాన్య దిశలో అరటి చెట్లు ఉన్నట్టయితే దోషములు సంభవిస్తాయి.