ఒక భవంతిని నిర్మించాలంటే, దానికి ముందుగా ప్లాన్ ఉండాలి. ఓ మామూలు కట్టడానికి, ఆర్కిటెక్ నిర్మించిన భవనానికి ఎంతో తేడా ఉంటుంది. కాని, ఇంతటి కీలకమైన ఆర్కిటెక్చెర్లకు రాష్ట్రంలో కొరత అమితంగా ఉంది. ఈ తరుణంలో కేంద్ర బడ్జెట్లో విజయవాడకు ఆర్కిటెక్ వారి యూనివర్శిటీ మంజూరు కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖనగరాల్లో ఏ పెద్ద నిర్మాణం చేపట్టినా, దానికి ఆర్కిటెక్ ఇంజినీరు హైదరాబాద్ నుంచి రావాల్సిందే. కోస్తా జిల్లాల్లో ఆర్కిటెక్చెర్ల కొరత తీవ్రంగా ఉన్న తరుణంలో కేంద్రమంత్రి చిదంబరం చల్లని మాట చెప్పారు. వాణిజ్యరాజధానిగా పేరొందిన విజయవాడలో ఆర్కిటెక్చెర్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో నిర్మాణ రంగానికి సరికొత్త ఒరవడి వస్తుందని ఆ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పది జిల్లాల్లో ఆర్కిటెక్చెర్ల కొరత తీవ్రంగా ఉంది. కాగా, ఈ ప్రాంతాలలోని పలు నగరాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిర్మాణ పరిశ్రమ వేగవంతమైన తరుణంలో విజయవాడలో ఆర్కిటెక్చెర్ యూనివర్శిటీ ఏర్పాటు యువ ఇంజినీర్లలో ఉత్సాహాన్ని నింపుతుంది.