దేశ ఆర్థిక మంత్రి పళనిస్వామి చిదంబరం 2008-09 వార్షిక బడ్జెట్ రహస్యాన్ని శుక్రవారం అందరికీ తెలుపనున్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ జనాకర్షగా వుంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఇదే అంశాన్ని ప్రతిబింభంగా చేసుకుని బడ్జెట్ను దాఖలు చేయడం జరిగింది. ప్రయాణికులు, సరకుల రవాణాపై చార్జీల వడ్డన లేకుండా బడ్జెట్ రూపొందించి అందరి మన్ననలు పొందారు.
అలాగే ఆర్థికనిపుణిగా పేరొందిన చిదంబరం కూడా తాజా బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలు నిండివుంటుందని బడ్జెట్ మేధావులు విశ్లేషిస్తున్నారు. అయితే గురువారం ప్రకటించిన ఆర్థిక సర్వే సూచించిన సంస్కరణలు తాజా బడ్జెట్లో వుండక పోవచ్చని కొందరి అభిప్రాయం.
ఎందుకంటే ఈ సంస్కరణలు చేపట్టాలంటే యూపీఏ కీలక మద్దతుదారులైన వామపక్షాల మద్దతు ఎంతో కీలకం. దేశంలో సంస్కరణలు చేపట్టేందుకు లెఫ్ట్ పార్టీలు ససేమిరా అంటున్నాయి. సంస్కరణలకు ప్రభుత్వం నడుంబిగిస్తే యూపీఏ ప్రభుత్వం కుప్పకూలక తప్ప ఇప్పటికే హెచ్చరించాయి.