కేంద్ర ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ గురువారం తన తొలి వార్షిక బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో లక్షలాది మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూర్చేలా ఆదాయ పన్ను పరిమితిని పెంచే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా.. దీర్ఘకాలిక సేవింగ్స్పై ఆదాయపన్ను పరిమితిని రెట్టింపు చేసే అవకాశాలు ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి వాటిలో హౌసింగ్ లోన్స్ రీపేమెంట్ (ప్రిన్సిపల్), ఐదేళ్లు లేదా అంతకుమించి కాలపరిమితి కలిగిన డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్స్, బీమా పాలసీల ప్రీమియం, వాహనాలపై పెట్టిన పెట్టుబడులు ఆదాయపన్ను చట్టం 80సి కింద పన్ను పరిమితి మినహాయింపు ఉంది. ఈ పెట్టుబడుల పరిమితులను పెంచే అవకాశం ఉంది.
అదేవిధంగా ఆదాయపన్ను పరిమితిని రూ.2 లక్షలకు పెంచడం. దీనివల్ల అధిక ఆదాయం (రూ.10 లక్షల ఆదాయం కలిగినవారు) కలిగిన వారు యేడాదికి రూ.30 వేల వరకు ఉపశమనం పొందుతారు. మధ్యతరగతి విభాగానికి చెందిన ఉద్యోగస్తులు (ఆదాయపరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు) రూ.20 వేల వరకు లబ్ధి పొందవచ్చు. వ్యక్తిగత ఆదాయ చెల్లింపుదారులు (రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయం కలిగినవారు) యేడాది రూ.10 వేల వరకు లబ్ధి పొందుతారు.
అయితే ప్రస్తుతమున్న ఆదాయ పన్ను పరిమితికి అదనంగా మరో రూ.లక్షను పెంచడం వల్ల ప్రభుత్వంపై రూజ.30 వేల కోట్ల భారం పడనుంది. ఈ మొత్తాన్ని ఇతర వస్తువులపై పన్నులు పెంచడం వల్ల రాబట్టుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా... ఎక్సైజ్ డ్యూటీ, దిగుమతి సుంకాలను పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.