ప్రేమంటే ఎలా ఉంటుందో చెప్పే మధురమైన '1947 ఎ లవ్స్టోరీ'
, మంగళవారం, 6 సెప్టెంబరు 2011 (18:47 IST)
పాయింట్: బ్రిటీష్పాలనలో మదరాసు పట్టణంలో 1947లో జరిగిన ప్రేమకథ.ఆర్య, రియా జాక్సన్ జంటగా నటించిన 'మదరాసు పట్టణం' తమిళనాడులో విజయాన్ని సాధించింది. 20 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. విజయ్ దర్శకునిగా తొలిచిత్రం. తెలుగులో ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షన్ సంస్థ '1947 ఎ లవ్ స్టోరీ' పేరుతో విడుదల చేసింది. లవ్స్టోరీలు రొటీన్గా వస్తున్న తెలుగు ప్రేక్షకులు ఇది తీయటి జ్ఞాపకాన్ని ఇస్తుంది. స్క్రీన్ప్లేలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్తలు కథలో ఇన్వాల్వ్ అయ్యేట్లు చేశాడు. ప్రతి పాత్రా నిజంగా జరుగుతున్నట్లుంటుంది. ఎక్కడా కల్పితం కన్పించదు. కథలో పట్టు, ఎడిటింగ్, ఫొటోగ్రఫీ, సంగీతం అన్నీ సమకూరడంతోపాటు కేవలం చూపుల్తోనే భావాల్ని వ్యక్తం చేసే పాత్రల్లో అందరూ నటించారు. ముఖ్యంగా బ్రిటీష్ దొరసానిగా రియా జాక్సన్ అమరింది. వృద్ధాప్యంలో ఆమె కన్నులతోనే హావభావాలు పలికించి మెప్పించింది.కథగా చెప్పాలంటే.. బ్రిటీష్ దొరల కాలంలో మదరాసు పట్టణంలో ప్రజలు వారికి బానిసలుగా బతికేవారు. అందులో రజకులు ముఖ్యులు. వారుండే కాలనీలో నాజర్ కొంతమందిని ముష్టియుద్ధాలకు తర్ఫీదు ఇస్తుంటాడు. అందులో ఆర్య ఒకడు. కల్లాకపటం లేని మనుషులు. దొరల దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసి ఇవ్వడం వారి వ్యాపకం. హాయిగా సాగుతున్న వారిజీవితంలో 47లో వచ్చిన మదరాసు గవర్నర్ గోల్ఫ్కు స్థలాన్ని వెతుకుతుంటాడు. అక్కడి ఆఫీసర్ మదరాసు రైల్వేస్టేషన్కు సమీపంలో గల రజకుల ప్రాంతాన్ని ఎంపిక చేస్తాడు. అందుకోసం వారిని ఖాళీ చేయమంటాడు. వినకపోతే క్రూరంగా శిక్షిస్తాడు. గవర్నర్ కుమార్తె రియాజాక్సన్ ఊరిని చూడటానికి గైడ్గా ఆర్యను పెట్టుకుంటుంది. అలా వారు నివశించే ప్రాంతానికి వచ్చి వారి బాధలు తెలుసుకుంటుంది. గోల్ఫ్ కోసం వారి జీవితాలను నాశనం చేయాలనునే అధికారికి బుధ్ధి చెబుతుంది. అయితే ఆ అధికారే రియాను పెండ్లి చేసుకోవాలనుకుంటాడు. ఓ సందర్భంలో ముష్టియుద్ధానికి దిగి అధికారి ఆర్య చేతిలో ఓడిపోతాడు. దాంతో సమస్య తీరుతుంది. కానీ రియా ఆర్యను ప్రేమిస్తుంది. అది తెలిసిన గవర్నర్ ఆర్యను శిక్షించే బాధ్యతను అధికారికి అప్పగిస్తాడు. అదే టైమ్లో 47 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్య్రం ఇస్తున్నట్లు గవర్నర్ ప్రకటిస్తాడు. ఇక స్వాతంత్రం వస్తే తాము ఇక్కడ ఉండకూడదని కుమార్తెను తీసుకుని గవర్నర్ వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ రియా ఆర్యపై ప్రేమతో వారినుంచి తప్పించుకుని ఆర్యను కలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.
ఈ చిత్ర కథలో అన్నీ సమంగా కుదిరాయి. చిన్న చిన్నలోపాలున్నాయని వెతకడానికి ప్రయత్నించినా కథలో ఇన్వాల్వ్మెంట్ అడ్డుపడుతుంది. ప్రకాష్ సంగీతం బాగుంది. అప్పటి తరాకిని చెందిన ట్యూన్స్తోపాటు ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం కన్పిస్తుంది. దొరసానమ్మగా రియాజాక్సన్ చక్కగా అమరింది. అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా ఆర్య బాగా నటించాడు. దొరసానమ్మ వృద్ధాప్యంలో లండన్ నుంచి మదరాసు వచ్చి మల్లి(ఆర్య)కోసం వెతుకుతుండడతో కథ ప్రారంభమవుతుంది. స్క్రీన్ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా విజయ్ జాగ్రత్తవహించాడు. క్లైమాక్స్లో దొరసానమ్మ చేసిన నటన హృదయాన్ని టచ్ చేస్తుంది. ప్రేమకు అంతరాలు, అడ్డుగోడలు లేవని ఎన్నో కథలు, సినిమాలు చెప్పినా... దొరసానమ్మ ప్రేమకథ అద్భుతంగా ఉంటుంది. ప్రేమలేని వ్యక్తి నుంచి కూడా ప్రేమ పుట్టించే సన్నివేశాలు ఇందులో కన్పిస్తాయి. నిజమైన ప్రేమ ఎలా ఉండాలి? ఎలా ఉంటే ప్రేమికులు హాయిగా ఉంటారనేందుకు ఈ చిత్రం ఉదాహరణ. హైటెక్ యుగంలో ప్రేమకు, స్వాతంత్య్రం ముందు ప్రేమకు ఎంతటి వ్యత్యాసం ఉందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. నిజమైన ప్రేమికులు అనేవారు ఈ చిత్రాన్ని తప్పనిసరిగా చూడాలి. అలా అని మిగిలినవారు చూడవద్దని కాదు. వారు చూస్తే.. ప్రేమలో ఇంత తీయదనం, ఇంత త్యాగం ఉందా అని తెగ ఫీలయిపోతారు. ఆ తర్వాత బరువైన హృదయంతో థియేటర్ నుంచి తిరిగి బయటకు వస్తారు. అందుకే కాబోలు ఈ చిత్రాన్ని 80 ప్రింట్లతో ఇటీవలే విడుదల చేస్తే మరో 42 ప్రింట్లను పెంచాలని మల్టీడైమన్షన్ నిర్మాతలు చెప్పారు.తమిళ చిత్రాలు వచ్చేసి తెలుగు సినిమాను మింగేస్తున్నాయని ఫిలిం ఛాంబర్లో చర్చలు జరుపుకుంటూ... జట్టు పీక్కుంటున్న వారంతా గ్రహించాల్సింది ఒక్కటుందని ఈ చిత్రం చెబుతుంది. ఏవో కథలతో ఏదో సినిమా తీశాం అని తీస్తున్న తెలుగు సినిమావారికి ఈ చిత్రం చెంపపెట్టుగా ఉంటుంది. ఈ పదాన్ని రాసినందుకు బాధగా ఉన్నా... చూసిన తర్వాత రాయక తప్పలేదు.