Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు సినిమాలకు కష్టకాలం.. బ్రహ్మోత్సవం ఫట్.. భిక్షగాడు హిట్.. కారణం ఏమిటి?

తెలుగు సినిమాలకు కష్టకాలం.. బ్రహ్మోత్సవం ఫట్.. భిక్షగాడు హిట్.. కారణం ఏమిటి?
, సోమవారం, 30 మే 2016 (17:36 IST)
ప్రస్తుతం తెలుగు సినిమా వెనుకబడిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక దశలో తమిళ చిత్రాలకంటే తెలుగు కథలే బాగుంటాయని పేరు వుండేది. బాహుబలితో ఒక్కసారిగా జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు మంచి పేరు వచ్చింది. అలాంటిది గత రెండునెలలుగా సరైన సినిమా రాకపోవడంతో.. వచ్చినా.. ఎక్కువరోజులు ఆడకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం తమిళ సినిమాలు రావడం వాటిలో కొత్త దనం బాగా ఆకట్టుకుంటోంది. 
 
రొటీన్‌ ఫార్మెట్‌ వల్లేనా!
ఇటీవల వచ్చిన తెలుగు సినిమాల్లో కథ కొత్తదేమీకాదు.. పాతదే.. కానీ ట్రీట్‌మెంట్‌ కొత్తగా వుంటుందని ప్రతి దర్శక నిర్మాత హీరో చెబుతూనే వున్నారు. వారు చెప్పినట్లుగా సినిమాలు వుంటున్నాయి. గత్యంతరంలేక సినిమాలు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందుకు సాయిధరమ్‌తేజ్‌ సుప్రీమ్‌, అల్లు అర్జున్‌ సరైనోడు మహేష్‌బాబు బ్రహ్మోత్సవం, వసుదైక, టీనేజ్‌ చిత్రాలున్నాయి. 
 
సుప్రీమ్‌లో కథ ఏమాత్రం చెప్పుకోవడానికి లేదు. కానీ.. పసివాడి ప్రాణం తరహాలో.. చిన్నపిల్లాడి నేపథ్యంలో సాగిన ఈ చిత్రం కాస్త ఎంటర్‌టైన్‌ చేసింది. చెప్పుకోదగ్గ చిత్రాలు లేకపోవడంతో ఈ చిత్రం కొద్దిరోజులు ఆడింది. ఆతర్వాత వచ్చిన అల్లు అర్జున్‌ 'సరైనోడు' అంతే.. ఇందులోనూ కథ పెద్దగా వుండదు.. అల్లు అర్జున్‌ను పక్కా మాస్‌ హీరోగా చూపించాలి. అందుకు లాగిపెట్టి కొడితే.. భూమి బద్ధలవ్వాలి. అలాంటిది చూపించాలంటే బోయపాటి శ్రీనువల్లే అవుతుంది.. అందుకే పిల్లాడిలా.. నాన్న.. నాకు.. బోయపాటి శ్రీనుతో చేయాలనుందని.. అర్జున్‌ అడిగాడనీ.. అందుకే ఆయనతో సినిమా చేశాననీ.. నిర్మాత అల్లు అరవింద్‌ వెల్లడించారు.
 
ఇలా.. కొడుకు కోసం తండ్రి చేసిన ఈ సాహసం.. పోటీ చిత్రం లేకపోవడంతో.. థియేటర్లులో సేఫ్‌ ప్రాజెక్టుగా సరైనోడు నిలిచింది. అయితే చూసిన ప్రతీవారూ.. ఈ చిత్రంలో ఏమీలేదు.. అంతా యాక్షనే.. అంటూ పెదవివిరిచారు. ఇక ఆ తర్వాత వచ్చింది.. మహేష్‌బాబు.. బ్రహ్మోత్సవం.. ఈ చిత్రం మొదటినుంచి హైప్‌ వచ్చేసింది. సీతమ్మవాకిట్లో.. సినిమా తీసిన శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు కావడంతో.. బిజినెస్‌ బాగా అయింది. 
 
కానీ థియేటర్లలో విడుదలయినా తర్వాత.. ఈ చిత్రం నిరాశపర్చింది. ముఖ్యంగా అభిమానుల్ని తీవ్ర నిరాశపర్చింది. దేవుడు పేరు పెట్టుకుని.. సాదాసీదా సినిమా తీశారనే విమర్శలు వచ్చాయి. ప్రేక్షకులు ఆదరణ చూపకపోవడంతో. చాలా చోట్ల సినిమాలను ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో.. తమిళ సినిమాలు ఒక్కసారిగా రావడంతో.. వాటిని ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడ్డారు.
 
మైస్మరైజ్‌ చేసిన సూర్య
ఇటీవలే విడుదలైన '24' సినిమాతో సూర్య మెస్మరైజ్‌ చేశాడు. గజినీ. యముడు వంటి భిన్నమైన చిత్రాలు చేసిన ఆయన్ను తెలుగు ప్రేక్షకులు భుజాలపై మోసారు. అలాంటిది. ఆయనే చేసిన సెవెన్త్‌సెన్స్‌, రాక్షసుడు వంటివి పట్టించుకోలేదు. దాంతో సూర్య నిరాశపడకుడా... 24.. అనే సినిమా చేయడం సవాలే.. ఆ సినిమా 'బ్యాక్‌ టు ది ఫ్యూచర్‌'ను పోలి వున్నదయినా.. 'మనం' దర్శకుడు విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించడం ఆకర్సణగా మారింది. దానికితోడు సూర్య నటించడం... అయితే ఈ సినిమా పెద్దగా జనాలకు అర్తంకాకపోయినా.. అందులోని కొత్తదనం మెస్మరైజ్‌ చేసింది. దాంతో ఇప్పటికీ ఆ సినిమా ఆడడం విశేషం.
 
ఇక ఆ తర్వాత వచ్చిన.. 'బిచ్చగాడు' గురించి చెప్పుకోవాలి. సంగీత దర్శఖుడు విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెలలో విడుదలై.. తొలి ఆటనుంచి మంచి టాక్‌తో రన్‌ అవుతుంది. నిర్మాత చదలవాడ పద్మావతి. ఈ చిత్రం ప్రింట్లను ఎక్కువగా పెంచారు. సినిమాలో కుటుంబవిలువలను బాగా చూపారనీ.. అవి సామాన్యుడ్ని టచ్‌ చేశాయని తెలియజేశారు. ఆ తర్వాత వచ్చిన.. విశాల్‌ 'రాయుడు' పక్కా మాస్‌ చిత్రమైనా.. అందులోనూ కుటుంబ విలువులన్నా.. యాక్షన్‌ బాగా వుంది. అయినా.. విశాల్‌ను తెలుగు వారు బాగా ఆదరించారు. ఈ చిత్రం కూడా బాగా రన్‌ అవుతుంది.
 
ఏది ఏమైనా.. తెలుగు, తమిళ సినిమా అనే బేధం లేకుండా.. ఎందులో కొత్తదనం.. ఊహించనివిధంగా మలుపులు, ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుందో వాటినే చూస్తారనేందుకు విడుదలైన తమిళ చిత్రాలే నిదర్శనమని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆ దిశగా తెలుగు సినిమా వుండాలని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పిక్చర్' లఘు చిత్రం.. సెలెబ్రిటీల ప్రశంసలు.. పూరీ చేతుల మీదుగా యూట్యూబ్‌లో..?