టాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ఆర్పీ పట్నాయక్ ఓ సీరియల్ నిర్మాతపై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తులసీదళం సినిమాకు ఆర్పీ కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించడమే కాదు దర్శకత్వం కూడా వహించారు. అలాగే నిర్మాతగానూ వ్యవహరించారు.
మొత్తానికి స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'తులసీదళం' సినిమా పాటలను అనుమతి లేకుండా 'అత్తో అత్తమ్మ కూతురో' అనే టీవీ సీరియల్లో ఉపయోగించారని ఆర్పీ ఫైర్ అయ్యారు. అందుకే ఆ సీరియల్ నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నామన్నారు.
ఇందులో భాగంగా రూ. రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నామని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. సీరియళ్లలో సినిమా పాటలు వాడుకోవడం మామూలేనని, కానీ, తమ చిత్రం ఇంకా విడుదల కాలేదని, విడుదల కాని సినిమా పాటలను సీరియల్లో ఉపయోగించడం ఎంతవరకు సబబని ఆర్పీ ప్రశ్నించారు. 'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ జెమినీ టీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.