ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో తెరకెక్కి, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం 'ది రాజాసాబ్'. ఈ చిత్రం రన్నింగ్ టైమ్ 3 గంటలకు పైగా సాగుతుంది. ఇపుడు కొత్తగా మరో ఎనిమిది నిమిషాల సన్నివేశాలను జోడించనున్నట్టు ఆ చిత్రం దర్శకుడు మారుతి వెల్లడించారు. శనివారం ఈ చిత్రం సక్సెస్ మీట్ను హైదరాబాద్ నగరంలో నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు ఈ మూవీలో కొత్తగా ఎనిమిది నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఎంతోమంది ఎదురు చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందులో ఉంటుందన్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ది రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద రూ.112 కోట్లు వసూలు చేసింది.
'తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో షో సరైన సమయంలో పడలేదు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా ఆయన చేశారు. ప్రభాస్ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా.
మైండ్ గేమ్గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు అందరికీ నచ్చింది. ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదని అంటున్నారు. ప్రభాస్తో నేను సింపుల్గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది' అని పేర్కొన్నారు.
'ఒక మూవీ సక్సెస్, పెయిల్యూర్ అనేది ఒక్క షో లేదా ఒక్కరోజులోనే నిర్ణయించకూడదు. పదిరోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుంది. మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థం కానీ, వాళ్లు తిడుతున్నారు. దయచేసి ఫలితాన్ని అప్పుడే నిర్ణయించొద్దు. ఓల్డ్ గెటప్లో ఉన్న ప్రభాస్ను టీజర్, పోస్టర్స్లో చూపించాం. సినిమాలో కనిపించకపోవడంతో అభిమానులు చాలా మంది సినిమాను ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే శనివారం సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం. వాటికి సెన్సార్ కూడా పూర్తయింది. ఆ సన్నివేశాల కోసం ప్రభాస్ కష్టపడ్డారు. మొత్తం 8 నిమిషాల సీన్స్ కొత్తగా యాడ్ అవుతాయి' అని పేర్కొన్నారు.