Publish Date: Wed, 08 Apr 2026 (11:38 IST)
Updated Date: Wed, 08 Apr 2026 (11:39 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఏప్రిల్ 8వ తేదీన పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ల కుమారుడు అకీరా నందన్ పుట్టిన రోజు. అలాగే, ఇదే రోజున సింగపూర్లో పవన్ కళ్యాణ్ - అన్నా లెజినోవా దంపతుల చిన్న కుమారుడు మార్క్ శంకర్ పునర్జన్మ పొందాడు. సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. సరిగ్గా యేడాది క్రితం ఈ ఘటన జరిగింది. ఇపుడు అకీరా నందన్ పుట్టిన రోజు, మార్క్ శంకర్ పునర్జన్మను గుర్తు చేసుకుంటూ ఆమె ఓ ట్వీట్ చేశారు.
'అకీరానందన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదంలో చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకోవడంతో తన కుటుంబం వణికిపోయిందని తెలిపారు. మార్క్ ప్రాణాలతో బయటపడటం ఒక అద్భుతమని పేర్కొన్నారు.
'ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేం.. ఎందుకంటే అకీరా పుట్టినరోజు. అతను ఎదుగుతున్న తీరును చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది. అతడు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి తెలుసుకుంటాడు. ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో ఉంటాడు.
ఇక మరోవైపు గతేడాది ఇదే రోజు మార్క్ అగ్నిప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అందుకే ఈరోజు మేము మా ఇద్దరు అబ్బాయిల విషయంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మార్క్కు ఇది నిజంగా పునర్జన్మ'.
'ఏడాది గడిచినా ఆ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 ఏళ్ల వయసున్న ఓ చిన్నారి మరణానికి, 18 మంది పిల్లలు ఆసుపత్రి పాలవడానికి కారణం ఎవరో మాకు ఇప్పటికీ తెలియదు. ఆ అగ్నిప్రమాదం వల్ల కొందరు పిల్లలకి సర్జరీలు అయ్యాయి. వాళ్లు ఎంతో బాధ అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈరోజు అతను క్షేమంగా ఉన్నాడు. తను శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటే ఆసుపత్రి బెడ్ పక్కన కూర్చొని చూసిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఏ తల్లికీ అలాంటి పరిస్థితి రాకూడదు. మార్క్తో పాటు 15 మంది పిల్లల్ని కాపాడిన కార్మికులకు నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. వాళ్లు నిజమైన హీరోలు' అంటూ ఆ రోజును అన్నాలెజినోవా గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం ఫొటోలతో పాటు తాను తిరుమలలో తలనీలాలు ఇచ్చిన ఫొటోను కూడా పంచుకున్నారు.