Komatireddy - Chiranjeevi
సినిమా పరిశ్రమను పట్టించుకోవడం మానేశానని తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ప్రభాస్ సినిమా రాజాసాబ్ విడుదలకుముందు ప్రీమియర్ షోల సమయంలో ఆయన పర్మిషన్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా నేడు ఆయన వీడియో విడుదలయింది. ఇందులో ఆయనను కొందరు సినిమా టికెట్ల విషయంపై పలు ప్రశ్నలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినిమా వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు. గత 10 రోజులనుంచి నన్ను ఎవరూ కలవలేదు. ఒకవేళ లెటర్ పెట్టివుంటే అవి కూడా నా దగ్గరకు రాలేదు. అసలు నన్ను సినిమా ప్రీమియర్లు, టికెట్ల పెంపు పై కలవద్దని చెప్పాను కూడా. గతంలో పుష్ప సినిమా టైంలో బాలక్రిష్ణ సినిమా టైంలో వారు వచ్చి కలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలవల్ల టికెట్ల రేట్ల పెంపు పై నా దగ్గరకు రావద్దని చెప్పాను. అదేవిధంగా టికెట్ ధరల పెంపుపై వస్తున్న జీవోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు.” అని తేల్చి చెప్పారు.
ఇంతకుముందు బాలక్రిష్ణ నటించిన అఖండ 2 విషయంలో టికెట్ల పెంపు విషయమై మంత్రి పర్మిషన్ ఇచ్చారు. కానీ సినిమా విడుదల కాలేదు. వారం తర్వాత విడుదలయింది. అయినా కూడా టికెట్ల రేట్లు పెంపు కొనసాగింది. దీనిపై మంత్రి సమాధానమిస్తూ, నాకు తెలీకుండా నేను లేని టైంలో అధికారులు చేసిన పొరపాటుగా ఆయన పేర్కొన్నారు.
మరి ఇప్పటికే చిరంజీవి సినిమా సంక్రాంతి నాడు విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రీమియర్లు, టికెట్ల రేట్ల పెంపుపై ప్రభుత్వం జీవో ఇచ్చిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వీడియో ఆసక్తికరంగా మారింది.