దాసరి-పవన్ కల్యాణ్ కాంబోలో త్వరలో సినిమా రాబోతోందని వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం దర్శకరత్న దాసరి నారాయణ రావు పవన్ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం మానివేసిన దాసరి తానూ మాట్లాడే ప్రతిసినిమా ఫంక్షన్ లో ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
హీరో శ్రీకాంత్ నటించిన ‘మెంటల్ పోలీస్’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో దాసరి మాట్లాడిన ప్రతిపదం పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ని దృష్టిలో పెట్టుకునే అన్నట్లు సినీ జనం అంటున్నారు. తాజాగా విడుదల అవుతున్న సినిమాలు కథ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి కోట్లాది రూపాయలు ఆ సినిమాల ప్రమోషన్ పైన పెద్ద పెద్ద సెట్స్ పైనా ఫారిన్ లొకేషన్స్ పైనా ఖర్చు పెట్టి కావాలని కోరి పరాజయాలు తెచ్చుకుంటున్నారు అని దాసరి కామెంట్ చేశారు.
అయితే ఈమధ్య కాలంలో అంత భారీ బడ్జెట్తో తీసిన ఒక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తప్ప మరే సినిమా అంత ఘోరంగా ఫ్లాప్ కాలేదు. సో దాసరి చేసిన కామెంట్స్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను టార్గెట్ చేసేవిగా ఉన్నాయని కొందరు చెప్తున్నారు. పవన్ కల్యాణ్ తనతో సినిమా చేస్తానని డిలే చేస్తుండటంతో పాటు చేసిన సినిమాలు కాస్త ఫెయిల్ కావడంతోనే దాసరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.