''ప్రసన్న రాసిన డైలాగ్స్ సినిమాకు హైలైట్ అనే చెప్పాలి. ఇంత అద్భుతమైన డైలాగ్స్ ఉన్న సినిమా నేను ఇప్పటివరకు చూడలేదు. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. 'పిల్లి కళ్ళ పాప' అనే పాట నాకు చాలా నచ్చింది. బడ్జెట్ లిమిటేషన్లో ఫోటోగ్రఫీ చక్కగా చేశారు. చాలా రోజుల తర్వాత సంతృప్తిగా ఫీల్ అయిన సినిమా ఇది. రాజ్ తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి హీరో అయ్యారు. మెచ్యూర్డ్గా నటించారు'' అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు.
రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా నటించిన చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ను దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రేక్షకులు గొప్పవాళ్ళు. సినిమా బాగుంటే చూస్తారు లేదంటే చూడరు. 'బాహుబలి', 'శ్రీమంతుడు' తర్వాత అదే రేంజ్లో హిట్ అయింది. ఈ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీకు మంచి ఎనర్జీ వచ్చింది. సాధారణంగా ఓ సినిమా విజయం తర్వాత ఆరు నెలల వరకు ఇండస్ట్రీలో హిట్ అనేది రాదు. కానీ రెండు భారీ ప్రాజెక్ట్స్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. మూడు నుంచి నాలుగు కోట్లు పెట్టి తీసిన ఈ చిత్రం సుమారుగా రూ.15 కోట్ల వరకు కలెక్ట్ చేయబోతోంది.
గతంలో 'మామా అల్లుడు' చిత్రం తీశాను. ఆ చిత్రంతో పాటు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా విడుదలయ్యింది. ఆ రెండు చిత్రాలు పెద్ద హిట్స్ అయ్యాయి. మామా అల్లుడు సుదర్శన్ థియేటర్లో 125 రోజులు ఆడింది. సినిమాలో వచ్చే ప్రతి ఫ్రేములో దర్శకుడే కనిపిస్తున్నాడు. ఇది టెక్నీషియన్స్ పిక్చర్. టీమ్ ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమా. అవికా అందంగా క్యూట్గా ఉంది. రావు రమేష్ చాలా బాగా నటించాడు. సినిమా చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి మరీ చెప్పాను. ఆర్టిస్ట్స్ అంతా చక్కగా నటించారు. ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తేనే ఇండస్ట్రీ కళకల్లాడుతుంది" అని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన, బెక్కం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తోటపల్లి మధు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.