Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలిని పైరసీ భూతం పట్టకూడదు, థియేటర్లో చూడండి: రాజమౌళి

బాహుబలిని పైరసీ భూతం పట్టకూడదు, థియేటర్లో చూడండి: రాజమౌళి
, మంగళవారం, 7 జులై 2015 (12:58 IST)
''బాహుబలి''ని పైరసీ భూతం పట్టకూడదంటూ దర్శకుడు రాజమౌళి అన్నారు. చిత్రం షూటింగ్ నుంచి లీకులతో విసిగిపోయిన జక్కన్న బాహుబలి థియేటర్లో చూడాల్సిన సినిమా అంటూ పైరసీలో చూడకండని పిలుపునిచ్చారు. జులై 10న 'బాహుబలి' చిత్రం విడుదల అవుతుందని...కేవలం థియేటర్లలోనే చిత్రాన్ని చూడండని ప్రేక్షకులను కోరారు. పెద్ద సినిమా, పెద్ద తెరపై చూడాల్సిన సినిమా బాహుబలి అని మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో తెలిపారు. 
 
ఎవరు ఎక్కడ పైరసీ చేసినా....వెంటనే తెలిసిపోతుందన్నారు. పైరసీ జరుగకుండా థియేటర్‌ యజమానులు చర్య తీసుకోవాలని రాజమౌళి డిమాండ్ చేశారు. సెకండ్‌షో తర్వాత థియేటర్లలో పైరసీ జరుగుతోందని రాజమౌళి తెలియజేశారు.
 
మరోవైపు తెలుగువారు గర్వపడేలా 'బాహుబలి'ని నిర్మించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. మంగళవారం బాహుబలి చిత్రంపై సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. బాహుబలి కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని తెలిపారు. రెండున్నరేళ్ల పాటు కష్టపడి 'బాహుబలి'ని నిర్మించారని...దయచేసి ఎవరూ పైరసీకి పాల్పడవద్దని అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేశారు.
 
సర్వీసు ప్రొవైడర్‌ నుంచి రక్షణ కోసం కోర్టు ఆర్డర్లు ఇచ్చిందని అల్లు అరవింద్ తెలిపారు. బాహుబలి పైరసీ వస్తే...మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌చేయాలని వినతి చేశారు. ఉద్దేశపూర్వకంగా పైరసీ చేస్తే థియేటర్లపై ఏడాది నిషేధం తప్పదని అల్లుఅరవింద్‌ హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu