Bhatti Vikramarka, Mahesh Chandra, Dr. Rajendra Prasad, Prithviraj
మహేష్చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం పిఠాపురంలో. అలా మొదలైంది అనేది ఉపశీర్షిక. డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్,మణిచందన, సన్నీ అఖిల్, విరాట్, సాయిప్రణీత్, శ్రీలు, ప్రత్యూష తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. మహేష్చంద్ర సినిమా టీమ్ పతాకంపై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్ఎం మురళి (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ గురించి దర్శకులు చెప్పారు. మంచి సందేశాత్మక చిత్రంగా అనిపిస్తోంది. యువతరం కుటుంబ సమేతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ఎదగాలనే సందేశం ఈ సినిమాలో ఉంది. ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి అని చెప్పారు.
డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందనే పాయింట్ని దర్శకుడు మహేష్చంద్ర అద్భుతంగా డీల్ చేశాడు. స్టోరీ నచ్చి నేను కూడా ఇష్టంగా ఈ సినిమా చేశాను. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు తరహాలోనే సందేశాన్ని అందిస్తూనే యువతరాన్ని ఆకట్టుకునే అంశాలున్న సినిమా ఇది అని తెలిపారు.
నటుడు పృధ్వీరాజ్ మాట్లాడుతూ ఇది మూడు కుటుంబాల కథ. ఈ ఇంటర్నెట్ యుగంలో తల్లిదండ్రులంటే గౌరవం కనబరచని యువతకు కనువిప్పు కలిగించే చిత్రం ఇది అని పేర్కొన్నారు.
దర్శకుడు మహేష్చంద్ర మాట్లాడుతూ నా తొలి సినిమా ప్రేయసి రావే నాకెంతో గొప్ప పేరు తీసుకొచ్చింది. ఈరోజుకీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఉంది. పిఠాపురంలో సినిమా కూడా అదే స్ధాయిలో నిలిచిపోయే సినిమా. నా మనసుకి నచ్చిన కథ ఇది. ముగ్గురు తండ్రుల కథలా అనిపిస్తూనే మూడు జంటల మధ్య నడిచే కథ ఇది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గారి నియోజకవర్గమైన పిఠాపురం పేరుతోనే ఈ సినిమా తీశాం. ఈ టైటిల్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారు ఆవిష్కరించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం అని తెలిపారు.