రామ్, తమన్నా జంటగా స్రవంతి మూవీస్ పతాకంపై ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'ఎందుకంటే.. ప్రేమంట!' చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు విజయభాస్కర్ క్లాప్ ఇచ్చారు. డి.సురేష్బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
చిత్రం గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ, మన జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు సమాధానం దొరకదు. అలాగే ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల మధ్య జరిగే సంఘటనలకు కారణం దొరకదు. వాటిని ప్రేమగా భావిస్తారు. అందమైన ప్రేమకథ ఇది. దర్శకుడు కరుణాకరన్ సున్నితమైన కథలను చాలా చక్కగా డీల్ చేయగలడు.
'తొలిప్రేమ' నుంచి డార్లింగ్ వరకు చాలా చక్కగా చేశాడు. హీరో విషయానికి వస్తే అల్లరి చిల్లరగా ఉంటాడు. మనింట్లో కంటే పక్కింట్లో పుడితే బాగుండు అనిపించేలా క్యారెక్టర్ ఉంటుంది. తమన్నా అద్భుతమైన నటి. అందరూ కలిసి చేస్తున్న ఈ చిత్రం జులైలో రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్ళనుంది అన్నారు.
రామ్ మాట్లాడుతూ, నేను ఏ టెక్నీషియన్స్తో కలిసి పనిచేయాలనుకున్నానో ఆ తరహా వారితో కలిసి చేస్తున్న సినిమా ఇది. మాతృసంస్థలో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో కోన వెంకట్ విలన్ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
తమన్నా మాట్లాడుతూ, ఈ బేనర్లో 'రెడీ' సినిమాలో చేశాను. అప్పటినుంచి చేయాలనున్నా ఇప్పటికి కుదిరింది. చాలా సహజత్వంతో కూడిన పాత్ర నాది. దర్శకుడు సినిమాలు చూశాను. డార్లింగ్ బాగా తీశారని మెచ్చుకున్నారు.
నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ, మంచి కథ ఉన్నా... నటీనటులు కుదరాలి. అలా చిత్రానికి కుదిరారు. చక్కటి అనుభూతినిచ్చే చిత్రమవుతుందన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఐ. ఆండ్రూ, సమర్పణ: కృష్ణచైతన్య, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.