రాములమ్మ "రుద్రమ దేవి" అవుతానంటోంది...
వెండితెరపై లేడీ అమితాబ్గా బిరుదును కొట్టేసిన విజయశాంతి, సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తల్లి తెలంగాణా పార్టీ పేరుతో ప్రజల ముందుకు వచ్చింది. తల్లి తెలంగాణా కలసి రాకపోవడంతో ఆ పార్టీని తెరాసలో విలీనం చేసి, అటు పిమ్మట ఆ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేసి ఎంపీ అయింది. అయితే ఆ తర్వాత కేసీఆర్- తనను పట్టించుకోవడం లేదని వాపోయిన విజయశాంతి వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్లోకి జంప్ అవుదామని అన్నీ సర్దుకుంది. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ మృతి చెందటంతో రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయింది. అయితే ఇటీవల తెరాస నేతృత్వంలో తెలంగాణా ఉద్యమం బలంగా ప్రజల ముందుకు రావడంతో తిరిగి తెరాస గూటికి చేరుకుంది. సొంత గూటికి వెళ్లినా... పార్టీలో ఆమెకు అంత ప్రాధాన్యం ఉన్నట్లు కనబడటం లేదని విశ్వసనీయ సమాచారం. ఈ నేపధ్యంలో తన ఛరిష్మాను మరోసారి చూపాలని విజయశాంతి కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె మళ్లీ మరోసారి వెండితెరపైకి దూసుక రానుంది. అయితే ఈసారి ఓరుగల్లు మహరాణి రుద్రమ దేవి అవతారంలో వస్తానని అంటోంది. అంటే తెలంగాణా సెంటిమెంటును మరింత విస్తృతం చేయడం ద్వారా తెలంగాణా ప్రజలకు మరింత చేరువ కావాలని ఆమె యోచన కాబోలు.