టాలీవుడ్ పునర్జన్మల కథలవైపు పరుగులు తీస్తుంటే హాలీవుడ్ చిత్ర పరిశ్రమేమో భవిష్యత్పై సినిమాలు తీసుకుంటూ పోతోంది. తాజాగా తమిళ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న రోబో కూడా హాలీవుడ్ తరహాలోనే భవిష్యత్లో స్టార్ట్ అవుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ మాత్రం ఈ సినిమా వర్తమానాన్ని కూడా తెలియనీయకుండా గోప్యంగా చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్స్ ఒళ్ళు గగుర్పొడిచే విధంగా రజనీకాంత్, ఐశ్వర్యరాయ్లతో పాటు 300మంది ఫైటర్స్ పాల్గొన్న ఫైట్ను పీటర్ హెయిన్స్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో ఇటీవల చిత్రీకరించారు. ఇటువంటి సన్నివేశాలు చిత్రంలో చాలా ఉంటాయని అంటున్నారు. అన్నిటికీ మించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే సన్నివేశాలు మరెన్నో ఉన్నాయని తెలుస్తోంది.
సహజంగా రజనీకాంత్ చిత్రమంటేనే ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. రజనీ మార్క్ను అలా ఉంచితే... ఆయన సరసన అందాల సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక చెప్పేదేముంది. అంచనాలు ఆకాశాన్నంటేశాయి. త్వరలో వెండితెరను పలుకరించనున్న రజనీ రోబో ఎటువంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి మరి.