'హృదయ కాలేయ' హీరో సంపూర్ణేష్ బాబుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంత సమయం గడిపారు. హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఈ హీరో లక్ష రూపాయలను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ మొత్తాన్ని సంపూర్ణేష్ బాబు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కు రూపంలో అందజేశారు. అతనితో పాటు 'హృదయ కాలేయం' దర్శక నిర్మాత సాయి రాజేశ్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా, తనకున్న పరిధిలో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సంపూర్ణేశ్ను చంద్రబాబు అభినందించారు. కేవలం, చెక్ తీసుకోవడమే కాకుండా సంపూర్ణేష్తో ఆయన కొంత సమయం గడపటం విశేషం. టాలీవుడ్లో సంపూర్ణేష్ బాబు క్రేజ్ గురించి, అనామకుడి స్థాయి నుంచి ఓవర్ నైట్ సెన్సేషన్గా ఎలా మారాడో చంద్రబాబు అడిగి మరీ తెలుసుకున్నారట. సినీరంగంలో మంచి స్థాయికి ఎదగాలని సంపూర్ణేష్కు చంద్రబాబు 'ఆల్ ది బెస్ట్' కూడా చెప్పారని హృదయ కాలేయ నిర్మాత వెల్లడించారు.