ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో చర్చల్లో ఉండే ప్రముఖ సినీ నటి కుష్బూ మరో సారి వార్తల్లో కెక్కింది. అయితే ఈ సారి ఆమె పై ప్రముఖ సినీ దర్శకుడు ఏఎం రమేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ సంచలన దర్శకుడు గతంలో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఇతివృత్తంతో వనయుద్ధం, రాజీవ్గాంధీ హత్యోదంతో కుప్పి వంటి చిత్రాలను తెరకెక్కించాడు. తాజాగా ఒరు మెల్లియకొడు పేరుతో చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో అర్జున్, శ్యామ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ చిత్ర కథ గురించి చెప్పాలని చిత్ర యూనిట్ సభ్యులను కుష్బు డిమాండ్ చేసినట్లు దర్శకుడు రమేష్ ఆరోపించారు. కుష్బు తన అసిస్టెంట్ డైరెక్టర్ వద్ద చిత్ర కథ గురించి విచారించారన్నారు. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ ఆత్మహత్యోదంతమా? అంటూ ఆమె అడిగారని అన్నారు.
అయితే తాను ఇంకా ఎవరికీ కథ గురించి చెప్పలేదని తెలిపిన ఆయన అసలు కుష్బూకు కథ గురించి తెలుసుకోవాలనుంటే తననే అడగవచ్చు కదా అని ప్రశ్నించారు. అయితే తన చిత్రం ఒక మర్మ హత్య సంఘటన ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమేనన్నారు. తన కథలో మనీషా కొయిరాల హత్యకు గురవుతారని, ఆ హత్య గురించి ఇన్వెస్టిగేషన్నే చిత్ర ఇతివృత్తం అని, ఇప్పుడు ఇంత వరకు మాత్రమే చెప్పగలనని రమేష్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే రమేష్ ఆరోపణలను నటి కుష్బు ఖండించారు. తాను ఎవరినీ చిత్ర కథ గురించి అడగలేదని స్పష్టం చేశారు. హీరో అర్జున్ భార్య చిత్రంలో నటించమని తనను కోరారని, అయితే తాను చిత్రాల్లో నటించడం మానేసి చాలా కాలం అయ్యిందని వారికి చెప్పినట్టుగాను, అంతే తప్ప కథ గురించి ఎవరినీ అడగలేదని కుష్బూ తెల్చిచెప్పారు.