విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం 'చీకటి రాజ్యం' ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. తమిళంలో 'తూంగా వనం'గా తెరకెక్కనున్న ఈ చిత్ర పోస్టర్ను హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం.సెల్వ తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన సొంత సంస్థ రాజ్కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు.
ఈ చిత్రంలో త్రిష, ప్రకాశ్రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఇందులో కమల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో కమల్ సరసన ప్రముఖ నటి మనీషా కోయిరాలా నటించే అవకాశముంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతం సహకారం అందించనున్నారు.