వీరి ఆటకు వారసులున్నారు... ఇక ఆట ఆపితే బావుంటుందంటున్నారు..
, శుక్రవారం, 1 నవంబరు 2013 (20:18 IST)
క్రీడల్లో ఆటలాడడానికి వారసత్వం ఉన్నా.. అందులో రాణించాలంటే చాలా ప్రావీణ్యం కావాల్సి ఉంటుంది. అదే ఏదైనా వ్యాపారంలో తమ వారసులను పెట్టినా దానికి ఇంతో అంతో బిజనెస్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యాపారం మీద ఆసక్తి కూడా ఉండాలి. మూడో రంగమైన కళారంగంలో.. అందులోనూ గ్లామర్ లాంటి సినిమా రంగంలో... ఎటువంటి వారైనా ఇట్టే ఎట్రాక్ట్ అవడానికి అవకాశముంది. అలా ఎట్రాక్ట్ అయి... తమ పెద్దల నుంచి వచ్చిన నటనా వారసత్వాన్ని వంశపారంపర్యంగా సాగిస్తున్న కుటుంబాలు బాలీవుడ్లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో లేకపోలేదు. గతంలో అగ్రనటులుగా పేరుపొందినవారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరు ఆ నలుగురు హీరోలుగా పేరుపొందారు. వీరందరికీ ఒక్కటే ఫార్ములా... ఒక్క చిరంజీవి తప్ప నటనను వారసత్వంగానూ పుణికి పుచ్చుకున్నవారే. ఇప్పుడు వారి కుమారులు వారి వేలు పట్టుకుని నడుస్తున్నారు. అయితే మరి ఇంకా వాళ్ళు నటించడంలో అర్థం ఉందా? లేదా? అనేది ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. హీరోలుగా తమ సత్తాను ఒకప్పుడు చూపించి.. ఇండస్ట్రీని శాసించిన వీరు వయస్సురీత్యా... ఆరు పదులకు దగ్గరల్లో ఉన్నవాళ్ళే. అయితే వీరు చేస్తున్న పాత్రలు హీరోలుగా చేయడంతో... ప్రేక్షకులు ఆదరిస్తున్నారో లేదో అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది.చిరంజీవి గురించి చెప్పాలంటే.. వారసత్వం లేకపోయినా... ఆయన తండ్రి పోలీసు ఆఫీసర్గా ఉండేవారు. ఆయనకు నాటకాలంటే ఇష్టం. తన హోదాలో ఉన్నప్పుడు తెలిసినవారు మదరాసులో ఉండగానే సినిమాల్లో చిన్నపాటి వేషాలు కూడా వేశారు. కెఎస్ఆర్దాస్ చిత్రంలో నటించారాయన. నెల్లూరులో ఉండటంతో చెన్నైకు దగ్గరగా ఉండటంతో సినిమా ప్రభావం పెద్దకొడుకు చిరంజీవిపై పడింది. క్రమేణా స్వయంకృషితో ఆయన పైకివచ్చి మెగాస్టార్గా ఎదిగాడు.ఆ తర్వాత క్రేజ్ను సొమ్ము చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చి... పెద్ద పోస్టును కొట్టేశారనుకోండి. ఇప్పుడు సినిమాల్లో తన వంశాన్ని దించారు. చిరు తర్వాత ఆయన స్థానాన్ని పొందడానికి సోదరుడు పవన్ కళ్యాన్, కొడుకు రామ్ చరణ్ భుజాలపై వేసుకున్నారు. ఆటోమేటిక్గా... తన అభిమానులు.. తన వారసుల అభిమానులుగా మార్చేశారు.
నందమూరి బాలకృష్ణ.... నటవారసత్వంగా పుణికిపుచ్చుకున్నవాడు ఈయన. తన తండ్రి ఎస్టిఆర్... హయాంలోనే బాలపాత్రలు వేసి.. యువకుడిగా హీరోగా నటించి తన సినీప్రస్థానాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. మంగమ్మగారి మనవడు, ఆదిత్య 369, పాండురంగ మహాత్మ్యం వంటి భిన్నమైన చిత్రాల్లో నటించాడు. కానీ క్రమేణా ఆయన చిత్రాలకు అపజయాలు తప్పలేదు. వయస్సురీత్యా ఇంకా హీరోగా నటిస్తున్నా ఆ ఛాయలు ఫేస్లో కన్పించడంతో గ్లామర్లో ఉండాల్సిన గ్లో లేకపోవడంతో ఇక బాలకృష్ణ హీరోగా పనికిరాడేమోనని అభిమానుల్లో నెలకొంది. ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు హిట్ లేకపోవడంతో బోయపాటి శీను 'సింహా'తో ఒక్క హిట్ ఇచ్చాడు. మళ్ళీ చాలాకాలం లేదు. దాంతో ఆయనే మళ్ళీ హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరు కాంబినేషన్లో 'లెజెండ్' (ఇంకా పేరు పెట్టలేదు) చిత్రం రాబోతుంది. అయితే ఇందులో యువకుడిగానూ, పెద్దతరంగానూ నటిస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వెళ్ళడానికి బాట వేసుకున్నాడు. వియ్యంకుడు చంద్రబాబు పార్టీలో తనో కీలక పాత్ర పోషించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.