చండీ రివ్యూ: అల్లిబిల్లి కథనంతో సీరియల్ను తలపిస్తోంది..!
ప్రియమణికి ఓ బ్రాండ్ ఉంది. సహజత్వంగా నటిస్తుంది. జాతీయ స్థాయిలో అవార్డుకూడా పొందింది. అటువంటి నటిని ఎంచుకుని రాక్షసులను చంపే అమ్మవారి పాత్రలో దర్శకుడు వి. సముద్ర నటింపజేశాడు. కథను ఎలా చెప్పాడో కానీ... ఈ చిత్రాన్ని తీయడంలో అతను ఏం చేశాడో? ఏం చేయకూడదో తెలుసుకుందాం...కథ: చండీ గంగ (ప్రియమణి) సమాజంలో జరుగుతున్న అరాచకాలు చేసేవారిని చంపేస్తుంది. హైదరాబాద్కు కొత్తగా వచ్చిన కలెక్టర్ను తల నరికి బ్యాగ్లో తీసుకుపోతుంది. దానికి శరత్కుమార్ అండగా నిలుస్తాడు. తన పాత్ర ఏమిటో చెప్పడు. తను ఆమెకు ఒక ఇండియన్గా స్పందించి సాయం చేస్తుంటాడు. ఆ తర్వాత ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో బస్సులో ఓ అమ్మాయిని 6గురు రేప్ చేస్తుండగా సడెన్గా వచ్చి.. వారికి బుద్ధి చెబుతుంది. మరోవైపు...గ్రూప్-4 ఉద్యోగలకు ఇచ్చిన భూముల్ని ఓ నాయకుడు కబ్జాచేస్తే సి.ఎం.కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇది వార్తల్లో విన్న చండీ... అతని ఇంటికివెళ్ళి రౌడీగ్యాంగ్లను తన చేతుల్తో తుదముట్టించి హీరోలా పంచ్డైలాగ్లు చెప్పి.. వారి భూముల్ని వారికి ఇస్తుంది. అలాంటి చండీ.అసలు ఎవరు? అనేది ఫస్టాప్లోనే దర్శకుడు చెప్పేస్తాడు. వన్యపోరాటవీరుడు అల్లూరి సీతారామరాజు మనవరాలు. ఆయన తండ్రి కృష్ణంరాజుకూడా గ్రామ ప్రజలకు సేవచేయాలనుచూసి.. చేయలేకపోతాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన ఆమె ప్రభుత్వాలు ఏమీ చేయకపోడంతో వ్యవస్థపై తిరగబడి.. ఒక్కోసమస్యకు పరిష్కారం చెబుతుంది. చివరికు సిఐడి చేతిలో చిక్కిపోతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.ఇందులో ప్రియమణి నటన వేలెత్తి చూపించడానికి వీలులేకుండా చేసింది. సీరియస్ పాత్ర కనుక తన ఎమోషన్స్ పండించింది. ఒకప్పటి విజయశాంతి పాత్రను ఈమె పోషించింది. ఆమెకు రీప్లేస్గా ఈమెను చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన పాత్రలన్నీ మామూలుగా న్యాయం చేశారు. ఇందులో పాటలకు ఎక్కడా ఆస్కారం ఉండదు. డ్యూయట్లూ వుండవు. అందుకే దర్శకుడు కొత్త ప్రయోగం చేశాడని అనుకున్నాడు. అదేమంటే... గబ్బర్సింగ్లో పవన్కళ్యాణ్ విలన్స్చేత అంత్యాక్షరి చేయించినట్లు ఇందులో విలన్లే పోలీసులచేత అంత్యాక్షరి చేయిస్తాడు. అది వి. సముద్రకు, చిత్ర నిర్మాతకు ఏమి నచ్చిందోకానీ.. ప్రేక్షకుడికి మాత్రం పరమబోర్గా అనిపిస్తుంది. ఎక్కడా ఫీల్ ఉండదు. సింక్ అవ్వదు. ఏదో చేశాం అనిపించుకున్నారు. కామెడీ సన్నివేశాలు తీయాలంటే దర్శకుడికి పట్టు ఉండాలి. ఎవడైతేనాకేంటి, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ వంటి చిత్రాలు తీసిన వి.సముద్ర.. అలాంటి కథలతోనే రాసుకున్నాడు. కానీ బ్యాక్డ్రాప్ కొత్తగా ఉంటుందని... అల్లూరి సీతారామరాజువారసురాలిగా ప్రియమణిని పెట్టాడు. పేదల భూమల్ని ప్రభుత్వం కొనడం వాటిని నిరుపయోగంగా ఉండడం.. అనేది సెజ్పేరుతో గతంలో ఆర్. నారాయణమూర్తి తీశాడు. ఆయన తనదైన శైలిలో చూపించాడు. ఇప్పుడు వి.సముద్ర దానికి అల్లూరి కోటింగ్ కొట్టి.. నిర్మాతను పడేశాడనే చెప్పాలి. చిత్రం ఆరంభంనుంచి ఎక్కడా స్లోకాకుండా స్పీడ్గా రన్కావడంతో... ఎమోషనల్ క్యారీ చేయగలిగాడు. అది ఒక్కటే చిత్రంలో ఆకర్షణ. కథలో సూపర్మేన్లా ఎలా ప్రత్యక్షమవుతోందో.. ఎందుకో ఆమెకే తెలియాలి. దర్శకుడు చెప్పాడు కాబట్టి. అక్కడి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఎక్కడా సృజనాత్మకలేదు. పరమ రొటీన్గా ఉంటూ సీరియల్ను తలపిస్తుంది. ఇటువంటి చిత్రాల్ని చేయడంపై మరింత శ్రద్ధ దర్శకుడు పెడితే బాగుండేది.ఇంకా ఈచిత్రంలో నటించడానికి బోల్డు రౌడీలు, ఆర్టిస్టులు ఉన్నారు. మెడికల్ రంగం నుంచి వచ్చిన గేదెల శ్రీనివాస్ నిర్మాతగా తన పేరును చూసి మురిసిపోవడానికే అన్నట్లుంది. ఏ రంగంలో ఉన్నా.. సినిమా తీసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మెలగాలి.. నిర్మాత సెట్కురాకపోయినా బాధ్యతగా సినిమా తీయాలనే దర్శకుడూ అనుకోవాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి.