Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముద్రగడకు ఏమైనా జరిగిందో.. చంద్రబాబు తాట తీస్తాం : వీహెచ్ హెచ్చరిక

ముద్రగడకు ఏమైనా జరిగిందో.. చంద్రబాబు తాట తీస్తాం : వీహెచ్ హెచ్చరిక
, సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (09:07 IST)
కాపులకు బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు ఏమైనా జరిగితే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాట తీస్తామని టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు హెచ్చరించారు. ముద్రగడ పద్మనాభం దంపతుల ఆమరణ దీక్షకు సంఘీభావంగా కాపు సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (కేజేఏసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ఆదివారం రిలేదీక్షలు చేపట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులకు ఏమైనా జరిగితే అందుకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని బీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 
 
ముద్రగడ దంపతుల దీక్షను అణచి వేయాలని చూస్తే ఉద్యమం ఏపీలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తుందన్నారు. కాపుల డిమాండ్‌ న్యాయమైనదని... వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాపులు అన్ని జిల్లాలో రిలే దీక్షల క్యాంపులు నిర్వహించి ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu