తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులకు టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఊడిగం చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో బెయిల్పై విడుదలైన రేవంత్ రెడ్డి హద్దుమీరి ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.
హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చంకలు గుద్దుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకెళ్లే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులకు రేవంత్రెడ్డి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై 30 సంవత్సరాలు పోరాడతానని రేవంత్ రెడ్డి అనడాన్ని ప్రస్తావిస్తూ, అంతకాలం పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలన్నారు. రేవంత్ వ్యవహారం పాలమూరు జిల్లాను అప్రతిష్టపాల్జేసిందని విమర్శించారు. ఆయనకు కేవలం బెయిలు మాత్రమే వచ్చిందని, అంతమాత్రాన నిర్దోషిగా బయటపడినట్టు కాదన్నారు.