తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ సమీపంలోని బాటసింగారంలో అదృశ్యమైన ఏడో తరగతి విద్యార్థి ఉదయ్కిరణ్ హత్య గావింపబడినట్లు తేలింది. గురువారంనాడు పొద్దుటపూట స్కూలుకు వెళ్ళిన ఉదయ్కిరణ్ గురువారం సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు చింతలకుంట చెరువులో ఉదయ్కిరణ్ మృతదేహం ఉన్నట్లు కనుగొన్నారు.
పోలీసుల కథనం మేరకు.. ఉదయ్ కిరణ్ని హత్య చేసిన వారు శవాన్ని నీటిలో వేశారు. శవం పైకి తేలకుండా ఉండటానికి మృతదేహం మీద పెద్ద బండరాయిని పెట్టారు. పోలీసుల దర్యాప్తులో ఉదయ్ కిరణ్ని అతని పెదనాన్న కుమారుడు నవీన్ హత్య చేశాడని కనుగొన్నట్టు తెలిపారు.
ఈ స్థితిలో నవీన్ శుక్రవారం ఉదయం పోలీసులకు లొంగిపోయాడు. పెద్దల మధ్య వున్న ఆస్తి తగాదాల కారణంగానే నవీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది.