తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సరైన మొగుడు మేం కాదని, మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అని తెలంగాణ టీడీపీ యువనేత, పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ నిజాయతీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రక్కనబెట్టి... తనకు కోట్ల రూపాయలు ఇచ్చినవారికే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు.
ఇందుకు మెదక్ జిల్లాలోనే గతంలో బీబీ పాటిల్.... ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదాహరణలని ఆయన చెప్పుకొచ్చారు. మెదక్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాను ప్రచారం చేస్తూ... కేసీఆర్ బండారాన్ని బయటపెడతానని రేవంత్ హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు మెదక్లో కేసీఆర్కు మొగుడు లాంటి జగ్గారెడ్డిని బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ ఇటీవల సింగపూర్ వెళ్లింది... సింగారించుకోవడానికేనని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను కేసీఆర్ సింగపూర్ చేయలేరని... అయితే హైదరాబాద్ను అమ్మి సింగపూర్ను కొనగల సత్తా ఆయనకు ఉందని రేవంత్ చురకలంటించారు. ఈ సింగపూర్ పర్యటన వల్ల కేసీఆర్ ఏం సాధించారో ప్రజలకు వివరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.