Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కేసీఆర్ వెల్లడి!

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కేసీఆర్ వెల్లడి!
, మంగళవారం, 24 ఫిబ్రవరి 2015 (11:57 IST)
శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ తన రెండో అభ్యర్థిని ప్రకటించింది. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ నియోజకవర్గం నుంచి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన చేసింది. 
 
అంతకుముందు సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన క్యాంపు కార్యాలయంలో మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఇతర నేతలతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు జిల్లాలతో సంబంధమున్న నాయకుడు కావడం, తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఆకట్టుకోవాల్సిన అవసరాన్నీ పరిగణనలోకి తీసుకుని రాజేశ్వర్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. 
 
ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నల్లగొండ జిల్లా పార్టీ మాజీ కన్వీనర్ బండా నరేందర్‌రెడ్డి, వరంగల్ జిల్లా మాజీ కన్వీనర్ రవీందర్‌రావు, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డిని కూడా హైదరాబాద్‌కు పిలిపించారు. వీరితో వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ మాట్లాడి బుజ్జగించినట్లు తెలిసింది. ఇప్పటికే ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి టీఎన్జీవో నేత దేవీప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu