తెలంగాణ అంటే అదర్స్ అని అర్థ చెప్పింది. ఓ ప్రవేశ పరీక్షా దరఖాస్తు.. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేక స్థానం కల్పించినా.. ఆ రాష్ట్ర పేరును మాత్రం అందులో చేర్చలేకపోయింది. సాఫ్ట్వేర్ లో అది వీలుకాకపోవడంతో దానికి అదర్స్ అనే పేరు పెట్టారు. వివరాలు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్ బోర్డుకు స్థానం లభించింది. అయినా వారు ‘అదర్స్’ అనే ఆప్షన్ కిందనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థులంతా ‘అదర్స్’గా విద్యార్హతల ఆప్షన్ను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది.
జేఈఈకి దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థులంతా వెబ్సైట్లో తమ ఆప్షన్ను ‘అదర్స్’గా ఈ నెల 31లోగా మార్పు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఆన్లైన్ దరఖాస్తుల్లో సీబీఎస్ఈ గురువారం మార్పులు చేసిందని విద్యా మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల్లో.. ఏ బోర్డు నుంచి ఇంటర్/12వ తరగతి చదువుతున్నారనే సమాచారాన్ని నమోదు చేయాల్సిన ఆప్షన్లలో నవంబర్లో దరఖాస్తుల సమయంలో తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చలేదు.
దీంతో రాష్ట్ర విద్యార్థులంతా ఏపీ బోర్డు ఆప్షన్తో దరఖాస్తు చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణ బోర్డు నుంచి ఇంటర్ పూర్తిచేసే విద్యార్థులకు జేఈఈ మెయిన్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకిచ్చే 40 శాతం వెయిటేజీని కోల్పో యే పరిస్థితి రావడంతో వారంతా ఆందోళన చెందారు. ఇలాంటి తరుణంలో అదర్స్ ఆప్షన్ ను ఎంపిక చేసుకుంటే దానిని తెలంగాణ రాష్ట్రంగా పరిగణిస్తామని వెల్లడించింది.