నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట, నార్కట్పల్లిలలో రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. రెండు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. నల్లగొండ మండలం దోమలపల్లికి చెందిన కమ్మంపాటి ప్రసన్న (19), అదే గ్రామానికి చెందిన మేడి రమేశ్ (22) రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రసన్న నల్లగొండలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. రమేశ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
వీరిద్దరివి వేర్వేరు కులాలు కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు ఈ ప్రేమను అంగీకరించలేదు. రమేశ్ కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్కు పంపించగా, ప్రసన్నకు తల్లిదండ్రులు మరోవ్యక్తితో వివాహం నిశ్చయించారు. సంక్రాంతి పండుగకు గ్రామానికి వచ్చిన రమేశ్ను కలుసుకున్న ప్రసన్న వివాహ విషయం చెప్పింది. మనస్థాపానికి గురైన ప్రేమికులు సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయారు. నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి శివారులోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆలయ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు.
అలాగే, భార్యాభర్తలమని చెప్పి యాదగిరిగుట్టలోని ఎస్ఆర్ లాడ్జీలోని 114 గదిని అద్దెకు తీసుకుని ఓ జంట తాడుతో ఫ్యాన్కు ఉరేసుకున్నది. హైదరాబాద్లోని సరూర్నగర్ మండలం మీర్పేట్ సర్వోదయనగర్కు చెందిన గిరి మధుకర్(28) మెడికల్ రిప్రజెంటేటీవ్గా పని చేస్తున్నాడు. రెండేండ్ల క్రితం గుజరాత్కు చెందిన మధులతను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. ఎల్బీనగర్లో ఉండే మిత్రుడైన స్వామి ఇంటికి మధుకర్ తరచూ వెళ్లేవాడు.
స్వామి సోదరి దేవి(25) ఎల్బీనగర్లోని ఓ రెస్టారెంట్లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్నది. దేవితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. సోమవారం మధు కర్, దేవి యాదగిరిగుట్టకు వెళ్లి లాడ్జీలో గది తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం దాటినా బయటకు రాకపోవడంతో సూపర్వైజర్ కిటికీలో నుంచి చూడగా ఉరేసుకుని కనిపించారు. పెండ్లి చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసులు దర్యాప్తులోఉన్నాయి.