కాంగ్రెసు నల్లగొండ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై ఆయన తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మంగళవారం సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది.
సాధారణ ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు టికెట్ల పంపిణీ సమయంలోనూ వారి పేర్లు టీఆర్ఎస్ ముఖ్యుల చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. మంగళవారం సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన వాహనం దిగిన వెంటనే కలిసి ఆయన వెంట సీ బ్లాక్లోకి వెళ్లారు. గంటకుపైగా వారి మధ్య మంతనాలు జరిగాయి.
సీఎంతో భేటీ ముగిసిన పిదప కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు చెప్పారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించాయి. తెరాస అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయినందున విద్యుత్ కోతల నివారణకు ఇంకేం చేయగలదని ప్రశ్నించారు. జిల్లాలో జారతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వైద్యకళాశాల నిర్మించాలని కోరినట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరి వల్లే పార్టీని ప్రజలు నమ్మడం లేదని ఆయన లోలోన మధనపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరహాలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలోనూ భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కోమటిరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.