నేపాల్ భూకంపం వదలకుండా ఉంది. గత మూడు రోజులుగా వణికిస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటివరకూ మృత్యువాత పడ్డారు. మరోవైపు అక్కడికి వెళ్లిన తమవారి జాడ తెలియక కొందరు బిక్కుబిక్కుమంటున్నారు. హైదరాబాదు నుంచి ఎవరెస్ట్ అధిరోహణకు నేపాల్ వెళ్లిన నీలిమ అనే తెలుగు యువతి జాడ తెలియక ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
నీలిమ కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఆమె ఈ నెల 18న ఎవరెస్ట్ అధిరోహించేందుకు టీంతో కలిసి నేపాల్ వెళ్లింది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ సంస్థ విరాంబులస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వివిధ దేశాలకు చెందిన 21 మందితో సాహస బృందాన్ని ఎంపిక చేయగా వారిలో నీలమ కూడా ఉంది.
శనివారంనాడు నీలిమ తమతో మాట్లాడిందనీ, భూమికి 4600 మీటర్ల ఎత్తులో ఉన్నామనీ, తర్వాత ఫోన్ చేస్తానని చెప్పి తమకు ఓ ఎమర్జెన్సీ నెంబరు ఇచ్చిందని ఆమె తల్లిదండ్రులు చెపుతున్నారు. ఐతే ఆ తర్వాత నుంచి ఆమెతో మాట్లాడేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఫోన్ నెంబరు కనెక్ట్ కావడంలేదని వారు ఆందోళన చెందుతున్నారు.