హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని పట్ల అక్కడి టీచర్లు అమానుషంగా ప్రవర్తించారు. కళాశాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించడంతో ఆమె మానసిక వ్యధతో మరణించింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కళాశాలలో చదువుకుంటున్న 19 ఏళ్ల వర్షిణి కళాశాలకు ఆలస్యంగా వచ్చింది.
దీంతో లెక్చరర్లు వర్షిణిని తరగతి గదిలోకి అనుమతించడానికి నిరాకరించారు. దాంతో వర్షిణి తనకు నెలసరి వస్తోందని, అందుకే ఆలస్యమైందని తన లెక్చరర్కు చెప్పింది. ఐతే ఆ లెక్చరర్ చాలా దారుణంగా ప్రవర్తించారు. అవునా... ఐతే నీకు రుతుస్రావం అవుతుందని రుజువు చూపించు, కాలేజీకి ఇలా వచ్చిందే కాకుండా నటిస్తావా అంటూ ఆమెను అవమానకరంగా దూషించినట్లు వర్షిణి క్లాస్మేట్స్ చెప్పారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వర్షిణి ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. అనంతరం తీవ్ర మనోవ్యధతో కుప్పకూలిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు. ఈ అవమానం మరియు ఒత్తిడి కారణంగానే ఆమె చనిపోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
విద్యార్థిని మరణించడంతో కళాశాల ఎదుట విద్యార్థినీవిద్యార్థులు ఆందోళనకు దిగారు. కటువుగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు.