Publish Date: Fri, 06 Mar 2026 (14:26 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (14:29 IST)
సోషల్ మీడియాలో ప్రేమ పేరుతో కొంతమంది తేనె కంటే తీయనైన మాటలు చెబుతూ అవతలి వాళ్లను బురిడీ కొట్టిస్తుంటారు. ఈ వలలో పడిపోయిన కొంతమంది వాళ్లు ఎట్లా చెబితే అట్లా ఆడుతూ వారికి తమను తాము సమర్పించుకోవడమే కాకుండా ఇంట్లో వున్న నగదును, నగలను కూడా దొంగిలించి వారికి కట్టబెట్టేస్తున్నారు. ఇట్లాంటి ఘటన రాజన్న సరిసిల్ల జిల్లాలో జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే... రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రాంలో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడిది ఎల్లారెడ్డి మండలం, రాచర్ల గొల్లపల్లి గ్రామం. తనకు ఎన్నాళ్లగానో ఓ ఖరీదైన బైకుపై తిరగాలని ఆశగా వున్నది నా కోర్కె తీర్చమని ప్రియురాలికి విన్నవించుకున్నాడు.
తన దగ్గర డబ్బులు లేకపోవడంతో తల్లి నగలపై కన్నేసింది సదరు యువతి. అంతే... ఇంట్లో నగలను దొంగలించి వాటిని అమ్మేసి ప్రియుడికి పైకం సర్దుబాటు చేసింది. అతడు ఆ డబ్బును తీసుకుని బైకు కొనుక్కుని కులుకుతూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఇంట్లో తన నగలు కబడకపోయేసరికి యువతి తల్లి ఆందోళన చెందింది. తన బంగారాన్ని ఎవరో కొట్టేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు, ఆమె కుమార్తె నగలను దొంగలించిందని తేల్చారు.