ఇంగ్లాండ్ల జరుగుతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్లో శ్రీలంకపై ఐర్లాండ్ జట్టు పోరాడి ఓడింది. దీంతో శ్రీలంక మరో విజయాన్ని అందుకొని సెమీస్ చోటు ఖాయం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన పోరులో లంక 9 పరుగుల తేడాతో పసికూన ఐర్లాండ్ను ఓడించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. మలింగ, మెండిస్ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి లంకకు విజయాన్ని అందించారు. కష్టసాధ్యంకాని లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్కు ఓపెనర్లు పోర్టర్ఫీల్డ్, ఎన్జె.ఓబ్రియాన్ శుభారంభం అందించారు.
లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు జట్టును ముందుకు నడిపించారు. కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ (31) ధాటిగా ఆడటంతో ఐర్లాండ్ లక్ష్యం దిశగా వెళుతున్నట్లు కనిపించింది. అయితే పోర్టర్ఫీల్డ్ను స్పిన్ దిగ్గజం మురళీధరన్ పెవిలియన్కు పంపాడు. దీంతో ఐర్లాండ్ 59 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. తర్వాత వచ్చిన వైట్ కూడా విజృభించడంతో లంక బౌలర్లకు చెమటలు పట్టాయి 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వైట్ను కులశేఖర ఔట్ చేశాడు.
ఈ సమయంలో బౌలింగ్కు దిగిన మెండిస్ వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ను మలుపుతిప్పాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వెంటవెంటనే పెవీలియన్ దారిపట్టడంతో ఐర్లాండ్ పరాజయం పాలైంది. చివర్లో మూనే (31 నాటౌట్) ఒంటరి పోరాటం వృథా అయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో కట్టడి చేశారు. అయితే మాజీ కెప్టెన్ జయవర్ధనే (78, 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు.