ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఐర్లాండ్తో సోమవారం జరిగిన సూపర్-8 మ్యాచ్లో పాకిస్థాన్ 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-ఎఫ్ నుంచి సెమీస్ బెర్త్ను పాక్ జట్టు ఖాయం చేసుకుంది.
160 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. నాలుగు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన యువస్పిన్నర్ సరూద్ అజ్మల్ అద్భుత బౌలింగ్తో పాక్ జట్టును సెమీస్కు చేర్చాడు.
ఓ దశలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసి విజయం దిశగా పయనిస్తున్నట్లు కనిపించిన ఐర్లాండ్ తరువాత చతికిలబడింది. ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ (40), కెవిన్ ఓబ్రియాన్ (26), స్టిర్లింగ్ (17) ఐర్లాండ్ను విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. పాక్ బౌలర్లలో అజ్మల్ నాలుగు, ఉమర్ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కమ్రాన్ అక్మల్ అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. పాక్ ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచిన అక్మల్ 5 ఫోర్లు, సిక్స్తో 57 పరుగులు చేశాడు. షాజిబ్ (23), షాహిద్ ఆఫ్రిది (24), మిస్బాహుల్ హక్ (20)లు కూడా రాణించారు.