అమెరికాలో పిల్లికి స్వైన్ఫ్లూ...
, గురువారం, 5 నవంబరు 2009 (11:09 IST)
ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా దేశంలోని ఓ మార్జాలానికి స్వైన్ఫ్లూ మహమ్మారి వ్యాధి సోకింది. ప్రపంచంలోని యావత్ మానవజాతిని గడగడలాడిస్తున్న స్వైన్ఫ్లూ మహమ్మారి వ్యాధి చివరికి జంతువులను కూడా వదలడం లేదు. ప్రస్తుతం అమెరికా దేశంలోని ఓ పిల్లికి ఈ వ్యాధి సోకిందని పశు సంవర్ధక, ఆరోగ్యశాఖకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రతినిధి టామ్ స్కినర్ తెలిపారు.గత వారం పిల్లికి స్వైన్ఫ్లూ సోకిందని దానికి తాము తగు చికిత్సలు చేస్తున్నామని, దీంతో ప్రస్తుతం అది కోలుకుంటోందని ఆయన అన్నారు. సాధారణంగా పశువులకు వ్యాధి సంక్రమణం జరుగుతుందనేది తమకు తెలుసని, కాని ప్రస్తుతం ఏకంగా ఈ వ్యాధి పిల్లులకు, కుక్కలకు కూడా వ్యాపించిందని ఆయన చెప్పారు. పిల్లి ఏ ఇంట్లో నివసిస్తుండిందో ఆ ఇంటిలోని సభ్యుల్లో ఇద్దరికి ఇదివరకే స్వైన్ఫ్లూ సోకివుండిందని, దానికి వారు చికిత్స చేయించుకున్నారని వైద్యులు తెలిపారు.ప్రస్తుతం వారి ఇంటిలోని పిల్లికి ఈ వ్యాధి సోకడంతో వారు తమవద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వచ్చారని, తాము పరీక్షలు జరిపి దానికి తగు వైద్యం అందిస్తున్నామని డాక్టర్. బ్రెట్ అన్నారు.