2010 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం గెలిచిన బాక్సర్ మనోజ్కుమార్ కపిల్ దేవ్పై ఫైర్ అయ్యాడు. అర్జున అవార్డుల కమిటీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్పై బాక్సర్ మనోజ్ కుమార్ విమర్శలు కురిపించాడు. కోర్టులో న్యాయ పోరాటాన్ని గెలిచి, బుధవారం కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ నుంచి అర్జున అవార్డును స్వీకరించిన బాక్సర్ మనోజ్ కుమార్ ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
అయితే మరోవైపు అర్జున అవార్డుకు అన్నివిధాలా అర్హుడినైనా, తప్పుడు సమాచారంతో కపిల్ దేవ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ తనను పక్కనబెట్టి మరో బాక్సర్ను ఎంపికచేసిందని మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
చివరకు కోర్టులో పోరాడి ఇప్పుడు అర్జున అవార్డును అందుకుంటున్నానని మనోజ్ అన్నాడు. తాను కామన్వెల్త్లో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నానని కపిల్కు గర్వంగా సమాధానం చెప్తానని తెలిపాడు.
‘అప్పుడు నీవెవరు అని ప్రశ్నించావ్..ఈరోజు మళ్లీ చెబుతున్నా.. నేను మనోజ్ను. ఇదిగో.. అర్జున అవార్డు గ్రహీతను' అని కపిల్ను ఉద్దేశిస్తూ మనోజ్ ఘాటుగా బదులిచ్చాడు.