సుదిర్మన్ కప్: ముగిసిన భారత పోరు.. ఇంటిదారి పట్టిన ఆటగాళ్లు!
సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పోరు ముగిసింది. ఈ టోర్నీలో భారత్ లీగ దశలోనే ఇంటిదారి పట్టింది. ఇండోనేసియాపై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత క్రీడాకారులు 1-4 తేడాతో ఓటమి చవిచూసి నిరాశపరిచారు. ఆదివారం చైనా చేతిలో 0-5తో ఓడిన టీమిండియా వరుసగా రెండో పరాజయంతో ఈ ఈవెంట్ నుంచి నిష్ర్కమించింది. ఇండోనేషియాలోతో జరిగిన పోరులో పురుషుల డబుల్స్లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జోడి 13-21, 10-21తో ప్రతమ అంగా-సపుత్రో అగుంగ్ ద్వయం పరాజయం పాలైంది. అనంతరం మహిళల సింగిల్స్లో పి.వి.సింధు 15-21, 10-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ లిందావెని ఫనెత్రి చేతిలో ఖంగుతింది. మిక్స్డ్ డబుల్స్లో అపర్ణ బాలన్-అరుణ్ విష్ణు జంట 13-21, 14-21తో అహ్మద్ తొంతోవి-నాత్సిర్ లిలియానా జోడి చేతిలో ఓడిపోయింది.పురుషుల సింగిల్స్ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్కే చెందిన పారుపల్లి కశ్యప్ 21-18, 21-14తో రుంబాక హయోమ్పై గెలిచినా... అయితే నాలుగో మ్యాచ్లో అశ్విని పొనప్ప-ప్రద్న్యా గాద్రె జోడి 19-21, 20-22తో పోలి గ్రెసియా-మహేశ్వరి క్రిసిందా జంట చేతిలో ఓటమి చెందడంతో భారత్ పరాజయం ఖాయమైంది.