ప్రపంచ చెస్ రారాజు విశ్వనాథన్ ఆనంద్కు ది రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్లో మంగళవారం రాత్రి ఒక నక్షత్ర హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వార్డును రోటరీ క్లబ్ 3230 ప్రతినిధులు అందజేశారు.
అలాగే, ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఆనంద్ పేరుమీద అందజేసే ఉపకారవేతనాన్ని కూడా అండర్ 13 విభాగంలో తమిళనాడు స్టేట్ చెస్ ఛాంపియన్గా నిలిచిన 12 సంవత్సరాల మహాలక్ష్మి అనే బాలికకు అందజేశారు. మహాలక్ష్మి తండ్రి ఒక ప్లాస్టిక్ ట్రేడర్. ముగ్గురు కుమార్తెలు కలిగిన ఈయన మహాలక్ష్మికి చెస్ క్రీడలో మరింత ప్రోత్సాహం కల్పించే ఆర్థిక స్తోమత లేదు.
ఈ విషయాన్ని గ్రహించిన రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ ఉపకారవేతనాన్ని అందజేసింది. విశ్వనాథన్ ఆనంద్ చెస్ స్కాలర్షిప్ ఈ చిన్నారి క్రీడారంగ కెరీర్కు ఎంతగానో దోహదపడుతుందని రోటరీ క్లబ్ నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ భారతీయ చెస్ క్రీడారంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన ఘనత విశ్వనాథన్ ఆనంద్కే దక్కుతుందన్నారు. తొలి భారతీయ గ్రాండ్మాస్టర్గా పేరుగాంచిన ఆనంద్.. మ్యాచ్, నాక్, టోర్నమెంట్ విభాగాల్లో ప్రపంచ విజేతగా నిలిచిన ఏకైక క్రీడాకారుడు కావడం గమనార్హం.
అంతేకాకుండా, దేశంలోనే అత్యంత వేగవంతమైన చెస్ బ్రెయిన్ కలిగిన చెస్ ఆటగాడిగా ఆనంద్ అవతరించాడు. ఎంతో నిరాడంబరంగా ఉండే విశ్వనాథ్ ఆనంద్.. దేశంలోని ఇతర క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచాడని వారు కితాబిచ్చారు.