పూణేలో జరుగుతున్న ఎఫ్ఐవీబీ పురుషుల జూనియర్ వరల్డ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో బలమైన ప్రత్యర్థి రష్యాపై భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. రెండో రౌండులోని ప్రారంభ మ్యాచ్లో కొంత ఒత్తిడికి లోనైన భారత్.. రష్యాపై తుదకు 3-2తో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
భారత జట్టులో ప్రత్యేకించి గురిందర్ సింగ్, ఎంఎన్ రాజా జాకొబ్లు ప్రత్యర్థిపై దాడికి దిగారు. మ్యాచ్ చివరి వరకు ఇరు జట్ల మధ్య అదృష్టం దోబూచులాడింది. రెండు గంటలకు పైగా ఉత్కంఠతతో ఈ మ్యాచ్ సాగింది. 25-22తో ప్రారంభ గ్రేమ్లో విజయం సాధించడం ద్వారా పూల్-ఈ మ్యాచ్లో భారత్లో శుభారంభం చేసింది.
మూడో గేమ్లో 39వ నిమిషంలో భారత ఆటగాళ్లు తిరిగి పుంజుకున్నారు. కానీ రష్యన్లు తమదైన శైలిలో నాలుగో స్టేజిలో 25-22తో గెలుపొందారు. అయితే స్ఫూర్తివంతమైన నాయకుడిగా పేరొందిన మందీప్ సింగ్ సారథ్యాన జట్టు ఒత్తిడిని జయించి నిర్ణయాత్మక గేమ్లో రష్యాపై 15-11తో భారత్ గెలుపొందింది.
కాగా, భారత్ తన తదపురి మ్యాచ్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఈ మ్యాచ్ నేడు జరుగనుంది. మరోవైపు, పూల్-ఈలో అర్జెంటీనాపై 3-2తో బెల్జియం గెలుపొందింది. పూల్-ఈ, పూల్-ఎఫ్ల నుంచి రెండు టాప్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. ఇక ఒక్కో పూల్ నుండి రెండు జట్ల చొప్పున నాలుగు జట్లు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవలసి ఉంది.