ప్రపంచ టీమ్ చెస్ ఛాంప్స్: హరికృష్ణ ఓటమి
ప్రపంచ టీమ్ చెస్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణకు చుక్కెదురయ్యింది. ఫలితంగా రెండో రౌండ్ లీగ్ పోటీలలో భారత్ 1-3 స్కోరుతో అమెరికా చేతిలో పరాజయం పాలయ్యింది. భారత బృందంలోని సూర్యశేఖర గంగూలీ, అరుణ్ ప్రసాద్లు తమ గేమ్లను డ్రాగా ముగించగా, శశికిరణ్ కూడా ఓటమిని చవిచూశాడు. కాగా.. రెండో రౌండ్ అనంతరం భారత్ రెండు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది.తొలి రౌండ్లో అద్భుతమైన ఎత్తులతో అలరించిన భారత ఆటగాళ్లు రెండో రౌండ్లో అనూహ్యంగా వెనుకబడ్డారు. సిసిలియన్ వ్యూహంతో తొలి గేమ్ ఆడిన హైకర్ నకుమురా, శశికిరణ్ను పూర్తిగా కట్టడి చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్ చివరకు 46 ఎత్తులవద్ద ముగిసింది.రెండో గేమ్లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ క్వీన్స్ గాంబిట్ వ్యూహం ప్రదర్శించాడు. దీన్ని ప్రత్యర్థి అలెగ్జాండర్ ఆన్స్చుక్ సమర్థంగా ఎదుర్కోవటంతో 43 ఎత్తులవద్ద హరికృష్ణ గేమ్ను వదులుకున్నాడు. యూరీ సల్మాన్తో జరిగిన మూడో గేమ్ను గంగూలీ డ్రా చేసుకున్నాడు. దీంతో భారత్ కొంత కుదుటపడింది. అకోబియానతో జరిగిన గేమ్లో గెలుపు దగ్గర్లోకి వచ్చిన అరుణ్ 23 ఎత్తులవద్ద డ్రాతో సరిపెట్టుకున్నాడు.