ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ను మట్టికరిపించి పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచిన సెర్బియన్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ తాజాగా విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా ఏటీపీ ర్యాంకింగ్స్లో మొట్టమొదటి సారిగా నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సెర్బియా ఆటగాడిగా నోవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు.
అయితే సోమవారం విడుదలైన డబ్ల్యూటీఏ టెన్నిస్ ర్యాంకింగ్స్లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఏకంగా 175వ స్థానానికి పడిపోయింది. తద్వారా 1997కి తర్వాత సెరెనా విలియమ్స్ తన కెరీర్లోనే మొట్టమొదటి సారిగా లోయెస్ట్ స్పాట్కు దిగజారింది.
కాగా, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్తో ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నోవాక్ జకోవిచ్ 6-4, 6-1, 1-6, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా తొలిసారిగా వింబుల్డన్ టైటిల్ నెగ్గిన నోవాక్ జకోవిచ్, ఏడేళ్ల తర్వాత స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్, స్పెయిన్ రఫెల్ నాదల్ వంటి స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి ఏటీపీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది టెన్నిస్ సీజన్లో 48-1 టైటిల్స్ గెలుచుకున్నాడు. ఇందులో రెండు గ్రాండ్స్లామ్ ట్రోఫీలు కూడా ఉన్నాయి.
అయితే సెరెనా విలియమ్స్ మాత్రం తన ర్యాంకును కోల్పోయింది. ఒక ఏడాది పాటు టెన్నిస్ కోర్టు గాయంతో దూరమైన సెరెనా విలియమ్స్ వింబుల్డన్లో క్రీడాభిమానులు ఆశించిన స్థాయికి రాణించకపోవడంతో 175వ స్థానానికి పడిపోయింది.