స్టాక్ మార్కెట్ లాభాలతో ముగియడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకుని 10,804 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 3,342 వద్ద ముగిసింది. వాల్ స్ట్రీట్ మరియు జపాన్ ఉద్ధీపన ప్యాకేజీ విడుదల వంటి అంతర్జాతీయ విశేషాల సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్ ఈ రోజు ఉదయం 134 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది.
భారీ స్థాయి కంపెనీల స్టాకుల్లో లాభార్జన కోసం సాగిన విక్రయాలతో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా క్షీణించడం మొదలెట్టింది. ఈ ప్రక్రియలో ఉదయం ఇండెక్స్ కనిష్ఠంగా 10,656 వద్దకు చేరుకుంది. అయితే దిగువ స్థాయి సంస్థల స్టాకుల కొనుగోళ్లతో ఇండెక్స్ మళ్లీ పుంజుకుంది.
మధ్యాహ్నపు తాజా ట్రేడింగ్లో ఎంపిక చేసిన స్టాకుల కొనుగోళ్లతో నెగటివ్ జోన్ నుంచి సెన్సెక్స్ పాజిటివ్ జోన్లోకి ప్రవేశించింది. చివరి ట్రేడింగ్లలో క్రయవిక్రయాల జోరుతో సెన్సెక్స్ లాభాల శాతం కొంత వరకు తగ్గింది. దీంతో స్టాక్ మార్కెట్ ముగింపులో... 62 పాయింట్లు మాత్రమే లాభపడింది.
కాగా, స్టాక్ మార్కెట్ ఆరు వరసు ట్రేడింగ్లో 13 శాతంతో 1,236 పాయింట్లు లాభపడింది. మధ్యతరహా స్థాయి, చిన్నతరహా స్థాయి కంపెనీల ప్రభావంతో సెన్సెక్స్ పుంజుకుంది. ఈ రెండు ఇండెక్స్లు సుమారు 1.7 శాతం మేరకు లాభపడ్డాయి.
రియాల్టీ ఇండెక్స్ 5.5 శాతం, బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ 3.7 శాతం, బ్యాంకెక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్ ఇండెక్స్లు 2.5 శాతం చొప్పున లాభపడగా.. ఎఫ్ఎంసీజీ 1.5 శాతంతో బలహీనపడింది. సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి మొత్తం 2,650 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,783 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 789 కంపెనీల వాటాలు నష్టపోగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా ముగిశాయి.
లాభపడ్డ కంపెనీలు
టాటా స్టీల్, జైప్రకాశ్ అసోసియేట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఐసీఐసీఐ బ్యాంక్, డీఎల్ఎఫ్, స్టెరిలైట్, ఎల్అండ్టీ, గ్రాసిం తదితర సంస్థల వాటాలు లాభపడ్డాయి.
నష్టాలను చవిచూసిన సంస్థలు
హిందుస్థాన్ యునిలివర్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, భెల్, ఐటీసీ తదితర సంస్థల వాటాలు నష్టాలను చవిచూశాయి.