తెలుగు సినీ ఇండస్ట్రీ 2012 జనవరి టు 2012 డిసెంబరు.. ఏం జరిగింది?
, సోమవారం, 31 డిశెంబరు 2012 (12:47 IST)
పెద్ద చిత్రాలు పేలిపోతే.. చిన్న చిత్రాలు చిందులేశాయ్
రాజకీయం, క్రీడా రంగం తర్వాత సినిమా రంగం మనిషికి ముఖ్యమైంది. దైనందిన జీవితంలో ఓ భాగమైంది. నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి నిద్రపోయేవరకు సినిమా గురించి మాట్లాడడని మనిషి ఉన్నాడంటే ఆశ్చర్యమే. పాట రూపంలోనో మరే రూపంలో సినిమా.. సినిమా.... అందుకే దేశంలో ఎఫ్.ఎం. రేడియోలు ఎక్కువైపోయాయి. ట్రావెల్లోనూ పాటలు వింటుంటాం. అలాంటి ఎంటర్టైన్మెంట్ రంగం సినిమా. అయితే 2012 సినిమారంగం మిశ్రమ ఫలితాలను అందించింది. ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలు ఎక్కువ శాతం ఫెయిలయ్యాయి. కొత్తమొహాలతో తెరమీదకు వచ్చిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అవి ఎలా ఉన్నాయి... అనేది పక్కన పెడితే... ఈ ఏడాది ఒకరకంగా అందరికీ పని కల్పించడంలో తెలుగు ఇండస్ట్రీ సక్సెస్ అయింది.గత ఏడాది నీరసంగానే గడిచింది. ఎప్పుడైనా విజయం దక్కిందంటే చాలు ఇండస్ట్రీ కళకళాడినట్లుగా భావించేవారు. రెండుమూడేళ్లుగా డబ్బింగ్ సినిమాల హవా కొనసాగింది. ఈ ఏడాది మాత్రం గల్లంతైంది. విజయ్ నటించిన 'తుపాకి' చిత్రం సక్సెస్తో గట్టెక్కింది. అంతకుముందు 3 ఇడియట్స్ తెలుగులో విజయ్తో తీసినా ఫలితం లేకుండా పోయింది. హీరోయిన్లు హవా కూడా పెరిగింది. కాజల్, తమన్నా వంటివారు హిట్స్ కొట్టేశారు. నయనతార సీతగా మార్కులు కొట్టేసింది. అరుంధతి తర్వాత అనుష్కకు అంత హిట్ మళ్ళీరాలేదు. ఢమరుకం పేరుతో వచ్చినా అది పెద్దగా ఉపయోగపడలేదు. ఏడాది రకరకాలుగా చిత్రాలు విడులయ్యాయి. వాటిలో విజయాలు ఎంత.. దర్శకులు ఎలా తీశారు? ఇండస్ట్రీ ఏమంటుందో... చిన్న చమక్కులతో చదువుకుందాం.జనవరి ఈ నెల 6వ తేదీతో తొలిచిత్రంగా వీరు కె. దర్శకత్వంలో రూపొందిన 'కంపెనీ' విడుదలైంది. నిర్మాతలు కంపెనీ మూసేలా చేసింది. యూత్ టార్గెట్లో బ్యాచిలర్-2 విడుదలైంది. అంతగా ఆకట్టుకోలేదు. 'ప్లే' అనే సినిమా అడ్రస్ లేకుండా పోయింది. అటువంటి టైమ్లో మహేష్ బాబు 'బిజినెస్మేన్'తో పూరీజగన్నాథ్తో ముందుకువచ్చాడు. పెద్ద హిట్కొట్టాడు. రౌడీయిజాన్ని కూడా ఎలా బిజినెస్గా మార్చవచ్చనే కొత్త కాన్సెఫ్ట్ను రుచిచూపించాడు. వెంకటేష్ ఈసారి 'బాడీగార్డ్' అనే రీమేక్ చేశాడు కానీ అది నిర్మాతకు బాడీని మిగిల్చింది. నవగ్రహ చిత్రాల హీరోగా పేరుపొందిన నందమూరి తారకరత్న 'నందీశ్వరుడు'ని తీసుకువచ్చినా జనాలు చూడ్డానికిరాకపోయే. స్వామిజీల బండారాన్ని బయటపెట్టే చిత్రంగా 'అయ్యారే' అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాన్ని అయ్యోపాపం అన్నారు. ఫిబ్రవరిలో విష్ణు, మంజులిక అనే కొత్తజంట 'లవ్చేస్తే' మాకేంటని తిప్పికొట్టారు. 'జై తెలంగాణ'తో వచ్చిన ప్రాంతీయవాదాన్ని తెలంగాణాలో బాగానే ఆదరించారు. ఉద్యమాన్ని బాగా క్యాష్ చేసుకున్న దర్శకుడిగా ఎన్.శంకర్ పేరుతెచ్చుకున్నాడు. ఇక మిగిలిన చిత్రాలు రామదండు, మావూరి మహర్షి, రుషి, ధోని.. వీరంగం చిత్రాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. సిద్దార్థ్, అమలాపాల్ చేసుకున్న లవ్ కాస్త 'లవ్ ఫెయిల్యూర్' అయింది. సునీల్, ఇషాచావ్లాతో అచ్చిరెడ్డి నిర్మించిన 'పూల రంగడు'కు పూలవర్షం కురిపించారు. ఎప్పటినుంచో హిట్ కోసం వెతుకుతున్న తెలంగాణా హీరో నితిన్కు 'ఇష్క్'తో మొహబత్ చేసుకున్నాడు. ఆ తర్వాత 'టెన్త్క్లాస్' అంటూ పిల్లలతో సినిమా తీసి క్యాష్ చేసుకోవాలనుకున్న దర్శకుడు బి.ఎస్.రాజుకు పదిమంది జనాలు కూడా రాకుండా బుద్ధిచెప్పారు. రెండోరోజు సినిమా థియేటర్లలో లేపాల్సి వచ్చింది.