అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను మూడు రాష్ట్రాల్లో నిర్వహించడానికి టిటిడి సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ఆంధ్రతో పాటు తమిళనాడు, మహారాష్ట్రలలో కళ్యాణోత్సవాలను నిర్వహించనున్నారు. తొమ్మిది ప్రాంతాల్లో ఈనెల 28వ తేదీ వరకు శ్రీనివాస కళ్యాణోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టిటిడి సిద్ధమైంది.
మార్చి 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, 18వ తేదీన నెల్లూరు జిల్లా వరికుంటపాడు, 19వ తేదీన గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని ఉద్దండరాయునిపాడులోని రాజధాని శంఖుస్థాపన ప్రాంగణం, 20వ తేదీన గుంటూరు జిల్లా నరసారావుపేటలో నిర్వహిస్తారు.
20వ తేదీన మహారాష్ట్ర, పుణెలోని ఫడ్తార్ నాలెడ్జి సిటీ మైదానం, 25వ తేదీన తమిళనాడులోని నాగై జిల్లా కుట్టాలం, 26వ తేదీన తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలం, 27వ తేదీన పాండిచ్చేరిలోని లాస్పేట్ హెలిప్యాడ్ మైదానం, మార్చి 28వతేదీన తమిళనాడు లోని తిరువళ్ళూర్ జిల్లా పాలవేడుపొట్టె ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణాలను టిటిడి నిర్వహించనుంది. శ్రీనివాస కళ్యాణోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ఇప్పటికే పూర్తి చేసింది.