భక్తుల బాధలను నెరవేర్చడం కోసమే వేంకటేశ్వరుడు తిరుమల కొండలను మరో వైకుంఠంగా తీర్చిదిద్దుకున్నాడు. తన దర్శనం కోసం రావాలని భక్తులు సంకల్పించుకున్న క్షణం నుంచి, తన దర్శనం అనంతరం తిరిగి వాళ్లు తమ నివాసానికి చేరుకునేంత వరకూ ఆయన బాధ్యత వహిస్తుంటాడని అంటారు.
సాక్షాత్తు అక్కడ కొలువైంది ప్రత్యక్ష నారాయణుడే కనుక, ఎన్ని కష్టాలు ఎదురైనా లెక్కచేయక భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అలా ఓ భక్తుని సంకల్పంచే నిర్మించబడిన వేంకటేశ్వరస్వామి ఆలయం ఖమ్మంలో కనిపిస్తుంది.
ఖమ్మం - కాలువ గట్టు సమీపంలో గల ఈ ఆలయంలో శ్రీదేవి - భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలో స్వామివారి ధృవమూర్తి కళకళలాడుతూ కనిపిస్తుంది. గర్భాలయానికి రెండువైపులా గల ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు కొలువై ఉంటారు.
చాలాకాలం క్రితం నిర్మించబడిన ఆలయం కావడం వలన, ఇక్కడి స్వామివారి మహిమలు అనుభవంలోకి రావడం వలన భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ప్రతి శనివారం, పర్వదినాల్లోను, ధనుర్మాసంలోను ప్రత్యేక పూజలు, అలంకారాలు సేవలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించుకుని బాధలు చెప్పుకుంటే అవి మాయమైపోతాయని ఆలయ నిర్వాహకులు అంటున్నారు.