Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శివకుటుంబాన్ని దర్శించుకోండి.. సర్వ దోషాలను తొలగించుకోండి.!

శివకుటుంబాన్ని దర్శించుకోండి.. సర్వ దోషాలను తొలగించుకోండి.!
, సోమవారం, 24 నవంబరు 2014 (16:00 IST)
కార్తీక మాసమే కాదు.. ఏ మాసంలోనైనా శివకుటుంబం గల క్షేత్రాలను దర్శించుకునే వారికి సకల దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. శివుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి ఒకేచోట కొలువుదీరిన క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతుంటారు. 
 
శివకుటుంబాన్ని దర్శించుకోవడం వలన సమస్త దోషాలు నశించి, సకల శుభాలు చేకూరతాయి. వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. కుమారస్వామి విజయాలను కలిగిస్తాడు. పార్వతీదేవి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
 
ఇలా జీవితంలో అడుగడుగునా అనుగ్రహించే శివకుటుంబాన్ని ఒకే చోట దర్శించుకునే అవకాశం లభించడం ఒక అదృష్టంగా భావించాలి. అలాంటి అరుదైన క్షేత్రాలలో ఒకటిగా 'తేతలి' కనిపిస్తుంది. 
 
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ శివుడు,  రాజరాజేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. స్వామివారి గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో అమ్మవారు కొలువై భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.
 
ఇక వినాయకుడు, కుమారస్వామి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రాచీనకాలానికి చెందిన ఈ ఆలయం, అడుగడుగునా పవిత్రతను ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆలయ వాతావరణాన్ని పరిశీలిస్తే, అష్టదిక్పాలకులతో కలిసి నందీశ్వరుడు ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన దోషాలు దూరమై తొలగిపోయి.. శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు. 
 
ఇక అమ్మవారు సౌభాగ్యాన్ని రక్షిస్తూ ఉంటుందని మహిళా భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ తల్లికి కుంకుమ పూజలు నిర్వహిస్తూ .. చీరసారెలను సభక్తికంగా సమర్పిస్తారు. కార్తీక మాసంలోను మహాశివరాత్రి సందర్భంగాను స్వామివారికి ప్రత్యేక పూజలు విశేష సేవలు జరుగుతుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu