సాధారణంగా శ్రీ రామనవమికి ముందు రోజు అశోకాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజు గోరింటాకు వృక్షాన్ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇలా అశోకాష్టమి రోజున గోరింటాకు చెట్టును పూజించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కుటుంబ సంక్షేమం చేకూరుతుంది. ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
గోరింటాకు, అశోక వృక్షం అని పిలవబడే ఈ చెట్టును అశోకాష్టమి రోజునే కాకుండా మంగళవారం, శుక్రవారాల్లో పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. రామాయణంలో సీతమ్మ తల్లి రావణుని చెరలో అశోకవనంలో వున్న సందర్భంలో అశోక వృక్షాన్ని పూజించినట్లు విశ్వాసం.
ఆ అశోక వనంలోని గోరింటాకు వృక్షాలు సీతమ్మ తల్లిని ఓదార్చాయని.. ఆమెకు ధైర్యం చెప్పి.. మంచే జరుగుతుందని విశ్వాసాన్ని ఆమెలో నింపాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శ్రీరావనవమికి ముందు రోజు మహిళలు గోరింటాకు చెట్టును పూజించడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ కారణం చేతనే గోరింటాకును చేతిలో ధరించిన మహిళలకు, గోరింటాకును పూజించే వారికి సమస్యలంటూ వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. గోరింటాకు చెట్టును శోక నివారిణి అని పిలుస్తారు. అశోక అనే పదం శోక నివారణ అనే అర్థాన్ని ఇస్తుంది.
అందుకే అశోకాష్టమి రోజున మహిళలు ఈ వృక్షాన్ని అందంగా అలంకరించి.. నీరు పోసి, దీపం వెలిగించి పూజిస్తే.. కుటుంబంలో సంతోషం చేకూరుతుంది. గోరింటాకు చెట్టును పూజిస్తే ఆరోగ్యం లభిస్తుంది. గోరింటాకు ఆయుర్వేదం ప్రకారం శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది.
నరాల బలహీనతను సరిచేస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత, కుటుంబంలో ఐక్యత చేకూరేందుకు గోరింటాకు వృక్షాన్ని పూజించాలి. ఇంకా మానసిక ప్రశాంతత, మహిళల వృద్ధి వంటి శుభ ఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.